హైదరాబాద్ : ప్రేమించిన యువతి తనను కాదని మరొకరితో పెండ్లికి సిద్ధమైందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. 18 సార్లు కత్తితో శరీరంపై పొడవటంతో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నది. ఈ కేసులో నిందితుడు బస్వరాజును పోలీసులు గురువారం ఉదయం రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం బస్వరాజును పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మం డలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజ్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే మండలానికి చెందిన ఓ యువతి, బస్వరాజ్ కొంత కాలం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన యువతి కుటుంబసభ్యులు 3 నెలల క్రితం మరో యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థం ఫొటోలను చూసిన బస్వరాజ్.. తనను పెండ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. వేధింపులు భరించలేక అతని ఫోన్ నంబర్ను బ్లాక్ చేసింది.
అనంతరం ఆమె ఎల్బీనగర్లోని బంధువుల ఇంట్లో ఉంటుంది. కక్ష పెంచుకున్న బస్వరాజ్.. ఎలాగైనా సదరు యువతిని చంపాలనుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం బస్వరాజ్ ఎల్బీనగర్లో యువతి ఉంటున్న ఇంటికి వచ్చాడు. తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై 18 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. బాధితురాలి కేకలతో పైఅంతస్తులోని వ్యక్తులు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారమిచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.