నగరంలో జనాభా పెరుగుతున్నకొద్దీ మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగిపోతున్నది. దీంతో ఒకేసారి 14 చోట్ల కొత్తగా వంతెనలను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు డిజైన్లను రూపొందించారు. ప్రభుత్వ సూచనల మేరకు భిన్నంగా, నగర చారిత్రాత్మక నేపథ్యాన్ని ప్రాధాన్యతనిస్తూ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.545 కోట్లు మంజూరు చేసింది.
సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : మూసీ, ఈసీ నదులపై నిర్మిస్తున్న 14 వంతెనల్లో 5 బ్రిడ్జిలను హెచ్ఎండీఏ నిర్మిస్తుండగా, మిగతా 9 బ్రిడ్జిలను జీహెచ్ఎంసీ నిర్మిస్తున్నది. హెచ్ఎండీఏ నిర్మిస్తున్న 5 బ్రిడ్జిలకు సంబంధించిన టెండర్లను ఇటీవల పిలిచారు. మంచిరేవుల, బుద్వేల్ ఐటీ పార్కు-1, బుద్వేల్ ఐటీ పార్కు-2, పత్రాపసింగారం, ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేశారు. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు.
బుద్వేల్ ప్రాంతంలోనే రెండు బ్రిడ్జిలు
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్ కింద నుంచి పారే ఈసీ నదిపై బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనే రెండు బ్రిడ్జిలను హెచ్ఎండీఏ నిర్మించనున్నది. ఈసీ నదికి ఇరువైపులా ప్రభుత్వానికి చెందిన భూములు పెద్ద మొత్తంలో ఉండడంతో అక్కడ ఐటీ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే ఔటర్ రింగు రోడ్డు మార్గాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం ఐటీ కంపెనీలకు అనువుగా ఉండటంతో ఇక్కడ మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ వీటిని నిర్మించనున్నారు. బుద్వేల్ ఐటీ పార్కుతో రాజేంద్రనగర్ రేడియల్ రోడ్డును అనుసంధానం చేసే విధంగా ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా బండ్లజాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని ఖలీజ్ఖాన్ దర్గా, కిస్మత్పూర్ ప్రాంతాలను కలుపుతూ పలు అనుసంధాన రోడ్లను సైతం నిర్మించనున్నారు. బుద్వేల్ ఐటీ పార్కుకు సమీపంలోనే భవిష్యత్తులో ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గం ఏర్పాటు చేయనుండటంతో కొత్తగా పలు రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు.
మంచిరేవుల వద్ద హైలెవల్ బ్రిడ్జి
ఐటీ కారిడార్ను ఆనుకొని ఉన్న మంచిరేవుల ప్రాంతంలోనూ పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్నది. నార్సింగి వైపు మంచిరేవుల రావాలంటే ఔటర్ రింగు రోడ్డు, చేవెళ్ల రోడ్డు మీదుగా రావాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య గండిపేట చెరువు కింద నుంచి పారే మూసీ నదిపై ప్రస్తుతం లోలెవల్ బ్రిడ్జి ఉన్నా అది ఎంతో పురాతనమైనది. చిన్నగా ఉండడంతో పాటు ఎక్కువగా ట్రాఫిక్ను తట్టుకునే సామర్థ్యం లేదు. పైగా మూసీకి భారీగా వరద వస్తే ఈ బిడ్జ్రి నుంచి రాకపోకలు సాగించలేని పరిస్థితి. ఈనేపథ్యంలో మంచిరేవుల-నార్సింగి మధ్య హైలెవల్ బ్రిడ్జిని నిర్మించేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేస్తున్నది. అదేవిధంగా తూర్పు వైపున ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో నాగోల్ వైపు ఒక బ్రిడ్జి, ప్రతాపసింగారం వద్ద మరో బ్రిడ్జిని మూసీ నదిపై హెచ్ఎండీఏ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. టెండర్ల పరిశీలన పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు చేపడుతామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
మూసీ, ఈసీ నదులపై హెచ్ఎండీఏ నిర్మించే బ్రిడ్జిల వివరాలు (రూపాయలు కోట్లలో)
1. ఈసీ నదిపై రాజేంద్రనగర్ – బుద్వేల్ ఐటీ పార్కు-1 (180 మీటర్ల పొడవు, 4 వరుసలు) : 19.83
2. ఈసీ నదిపై రాజేంద్రనగర్ – బుద్వేల్ ఐటీ పార్కు-2 (196 మీటర్ల పొడవు, 4 వరుసలు) : 20.64
3.మూసీ నదిపై మంచి రేవుల వద్ద హైలెవల్ బ్రిడ్జి (180 మీటర్ల పొడవు, 4 వరుసలు) : 32.21
4. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద బ్రిడ్జి ( 210 మీటర్ల పొడవు, 4వరుసలు) : 29.28
5. ప్రతాప సింగారం వద్ద బ్రిడ్జి (210 మీటర్ల పొడవు, 4 వరుసలు) : 26.94