గోవింద నామ స్మరణతో మార్మోగిన టీటీడీ, పలు ఆలయాలు
దివ్య సాకేత క్షేత్రంలో వైభవంగా ఉత్తద్వార దర్శనం
ఎర్రగడ్డ శ్రీవిజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో శాసన సభాపతి పోచారం పూజలు
జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం
అంగరంగ వైభవం.. పురుషోత్తముడి నామ స్మరణం.
హిమాయత్నగర్/ బంజారాహిల్స్/శంషాబాద్/ కీసర/జూబ్లీహిల్స్, జనవరి 13;భక్త జనకోటికి ఆ ఉచ్ఛారణ పరమానందభరితం. ‘నారాయణ.. నారాయణ, నమో నారాయణాయ నమః, గోవిందా.. గోకుల నంద’ అంటూ భక్తజనం పరవశించిపోయింది. ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి సందర్భంగా గురువారం తెల్లవారు జాము నుంచి పలు ఆలయాలు విష్ణు సహస్ర నామాలు జపిస్తూ, ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి, గోవిందా.. గోవిందా అని భక్తుల జయ జయ ధ్వానాలతో పురుషోత్తముడిని దర్శించుకున్నారు. వేడుకలు భక్తుల కోలాహలంతో వైభవంగా జరిగాయి. ఏకాదశి గడియలు ప్రవేశించగానే ఆయా ఆలయాల్లో టీటీడీ వేద పండితులు, దేవాదాయ అధికారులు స్వామి వారికి ఏకాంత సేవలు నిర్వహించి అనంతరం, భక్తులను ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనానికి అనుమతించారు. మహా నగరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. కొవిడ్ నిబంధనలను అనుసరించి మాస్క్ ధరించిన భక్తులు పలు ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులందరికీ ఆయా ఆలయాల యాజమాన్యం తీర్ధ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ప్రత్యేక అధికారి జగన్మోహనా చార్యుల నేతృత్వంలో టీటీడీ వాలంటీర్లు భక్తులకు సేవలు అందించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శ్రీరామనగరం దివ్యసాకేత క్షేత్రంలో స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో జరిపారు. సర్వాలంకార భూషితుడుగా పల్లకీ సేవలో స్వామి వారిని ఊరేగించారు. ఆ తర్వాత చిన జీయర్ స్వామి భక్తులకు మంగళ శాసనాలు అనుగ్రహించారు. ఎర్రగడ్డలోని శ్రీవిజయలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనంతో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చీర్యాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ చైర్మన్ నవీన్ మిట్టల్ దంపతులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. చారిత్రాత్మకమైన జియాగూడ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్డీవో చంద్రకళ, గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్, శ్రీ రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాహిల్స్ హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలోనూ పూజలు వైభవంగా జరిగాయి. స్వయం భూ శ్రీలక్ష్మినరసింహస్వామి, శ్రీరాధా గోవిందులను ప్రత్యేకంగా అలంకరించారు. –