అవే మాటలు.. అందినంత దోపిడీ
వారి అకౌంట్లు.. కార్డుల సమాచారం తస్కరణ
మూడు దేశాల అమాయకులను దోచేసిన ఢిల్లీ, హైదరాబాద్ క్రిమినల్స్
ఏడుగురు అరెస్టు..కోటికి పైగా నగదు స్వాధీనం..
సిటీబ్యూరో, జనవరి 13(నమస్తే తెలంగాణ);అంతా సేమ్ టూ సేమ్…మన దగ్గర కేవైసీ అప్డేట్ అంటూ..మోసాలు… విదేశాల్లో మీ కంప్యూటర్లు, ఆన్లైన్ లావాదేవిల్లో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని చీటింగ్లు..ఇలా అక్కడా..ఇక్కడా.. సైబర్ మోసగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలా విదేశీయులను మోసం చేసిన
ఓ గ్యాంగ్ను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. భారీగా సామగ్రి, కోటికిపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడు విదేశీయులు..
ఇప్పటి వరకు మన దేశాన్ని టార్గెట్ చేసిన సైబర్ క్రిమినల్స్ ..ఇప్పుడు మన దగ్గర నుంచే విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలా మూడు దేశాల్లోని లక్షలాది మందిని బురిడీ కొట్టించారు. అలాంటి ఓ ముఠాను గురువారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో ఢిల్లీకి చెందిన ప్రధాన సూత్రధారి నవీన్ భుటానీ, మోహిత్, మోను, హైదరాబాద్కు చెందిన నాగరాజు, శ్రావణ్కుమార్, శ్రీనివాస్రావు, వెన్నలకంటి ఉన్నారు.
చాలా సులభంగా..
ఈ ముఠా అత్యంత సులభంగా అస్ట్రేలియా, సింగపూర్, యూకే దేశాలకు చెందిన వారిని నిండా ముంచారు. మాటలతో వారి కంప్యూటర్ల్లోకి చొరబడి ఖాతాలను ఖాళీ చేశారు. నవీన్ భుటానీ ఓ సంస్థను ఏర్పాటు చేసి.. ఢిల్లీ, పంజాబ్, ఘజియాబాద్లో మూడు కాల్ సెంటర్లు పెట్టుకున్నాడు. వాటి కోసం 8 టోల్ ఫ్రీ నంబర్లను తీసుకున్నాడు. అంతేకాకుండా విదేశీయుల ఖాతాలను కొల్లగొట్టినప్పుడు వారి నగదును బదిలీ చేసుకునేందుకు హైదరాబాద్ నాగరాజు టీంతో ఎనిమిది వెబ్సైట్లను ఏర్పాటు చేయించి.. వాటికి పేమెంట్ గేట్వేలను తీసుకుని కొన్ని అకౌంట్లను లింక్ చేశాడు.
ప్రకటనలు గుప్పించి..
గూగుల్ యాడ్స్ కోసం ఆ మూడు దేశాల వినియోగదారుల సమాచారాన్ని థర్డ్ పార్టీ నుంచి తీసుకొని.. వారికి పేమెంట్ గేట్వేస్ టెక్నికల్ సమస్యలు, కంప్యూటర్లలో ఉన్న వైరస్లను తొలగిస్తామని నవీన్ ప్రకటనలను గుప్పించి ఆకర్షించాడు. ఎవరైనా టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేయగానే.. ఈ ముఠా సభ్యులు సమస్య పరిష్కరించాలంటే మీ బ్యాంకు, ఆన్లైన్ లావాదేవిల వివరాలు కావాలంటూ.. ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో కంప్యూటర్లలో ఉన్న వైరస్లను తొలగించాలంటే.. గో టు అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేయించి కంప్యూటర్ను కంట్రోల్కు తీసుకొని.. మొత్తం సమాచారం తీసుకుంటున్నారు. ఆ దేశాలల్లోని రాత్రి సమయాల్లో లావాదేవిలు జరిపి.. నగదును వెబ్సైట్లకు లింక్ ఉన్న ఖాతాలోకి బదిలీ చేస్తారు. వారు మోసాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగానే ఆ దేశంలోని బ్యాంక్ బాధితుడికి డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. పేమెంట్ గేట్వేకు బదిలీని ఆపేస్తున్నారు.
మనదేశంలో..
మన దేశంలో పేమెంట్ గేట్వేలు వారికి లింక్ ఉన్న సంస్థలకు డబ్బులను చెల్లిస్తుంది. ఇలా ఈ సైబర్ మాయగాళ్ల వ్యవహారంతో పేమెంట్ గేట్వేలు నష్టాలకు గురవుతున్నాయని సైబర్ క్రైం పోలీసు విచారణలో తేలింది.