పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత
ఫ్రంట్లైన్ వర్కర్లకు జీహెచ్ఎంసీ భరోసా
ప్రతియేటా 23,370 మంది పారిశుధ్య కార్మికులకు రూ.7112.87 విలువైన సెఫ్టీ కిట్ అందజేత
ప్రతియేటా రూ.12 కోట్లు వెచ్చిస్తున్న బల్దియా
ప్రస్తుత కరోనా పరిస్థితులపై మరింత అప్రమత్తం
30 సర్కిళ్లలో కార్మికులకు కిట్స్ పంపిణీకి రంగం సిద్ధం
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. భాగ్యనగరాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా ఉన్న కార్మికుల ఆర్యోగ పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా కరోనా సమయంలో ఫ్రంట్లైన్ వర్కర్లకు రూ.కోట్లు వెచ్చించి సేఫ్టీ కిట్స్ను అందజేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ, వెటర్నరీ విభాగం ఉద్యోగులకు ప్రతి యేటా రక్షణ పరికరాలను అందిస్తుండగా, వీటిని కార్మికులు ఉపయోగించుకొని తమ ఆర్యోగాన్ని కాపాడుకుంటూ నగరంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు.
10 రకాల పరికరాలతో కిట్టు
ఆపత్కాలంలో పోరాడుతున్న వారికి అవసరమైన వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ), ముఖానికి మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమయ్యే సబ్బులు.. మొత్తం 10 రకాల పరికరాలతో కూడిన ప్రత్యేక కిట్టును అందిస్తున్నది. పారిశుధ్య కార్యక్రమాలతో పాటు కరోనా నివారణ చర్యల్లో భాగంగా సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేస్తున్న ఎంటమాలజీ విభాగం, వెటర్నరీ విభాగం సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందిస్తున్నది. అన్ని విభాగాలకు చెందిన 23,370 మంది సిబ్బంది కోసం ప్రభుత్వం ప్రతి యేటా దాదాపుగా రూ.12 కోట్లు ఖర్చు చేస్తూ.. కొవిడ్ రక్షణ సామగ్రికి అందజేస్తున్నది.
ప్రతియేటా.. 23,370 కిట్స్ అందజేత
కరోనా మొదటి వేవ్ 2020-21 సంవత్సరంలో 23,370 కిట్స్ను అందజేయగా, 2021-22 సంవత్సరంలోనూ అందరికీ కిట్స్ పంపిణీ చేశారు. తాజాగా కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో 30 సర్కిళ్లలో 23,370 మందికి సేఫ్టీ కిట్స్ పంపిణీకి రంగం సిద్ధం చేశారు. త్వరలో సర్కిళ్ల వారీగా ఎస్ఎఫ్ఏలు, ఎంటమాలజీ, వెంటర్నరీ, ఔట్సోర్సింగ్, శాశ్వత ఉద్యోగులకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.