సంక్రాంతిని పురష్కరించుకుని నగరం ఖాళీ
గ్రేటర్లో తగ్గుముఖం.. జిల్లాల్లో పెరిగే అవకాశం
వచ్చే వారం, పదిహేను రోజులే కీలకం
70శాతానికి పైగా ఎసింప్టమాటిక్ కేసులు
మాస్కు లేనిది బయటకు అడుగు పెట్టవద్దు
ఊర్లనుంచి వచ్చేవారు 7రోజులు స్వీయ నిర్భందంలో ఉండాలి
హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కరోనా ఊరెళ్లింది. అవును మీరు చదువుతున్నది నిజమే. అదేంటి ఎక్కడైనా మనుషులు ఊరెళ్తారు గానీ.. రోగాలు వెళ్తాయా.. అని అనుకుంటున్నారా..? కానీ ఇప్పుడు అదే జరిగింది. మనుషులతో మనుషులకు సోకే కరోనా సంక్రాంతి పండుగకు ఊరెళ్లింది. వారం పది రోజులుగా గ్రేటర్లో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఈనెల 2న 212, 5న 979, 8న 1583 కేసులు నమోదయ్యాయి. ఇలా రోజురోజుకూ పెరుగుతూ పోతున్న కేసులు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. 12న గ్రేటర్లో 1275కేసులు నమోదయ్యాయి. అయితే నగరంలో కేసులు తగ్గలేదని, జనాలు ఊరెళ్లడం వల్లనే కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు విశ్లేషించారు.
జిల్లాల్లో పెరగనున్న కేసులు
రాష్ట్రవ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే గ్రేటర్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు, నాలుగు రోజుల నుంచి చాలా మంది ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలోనే గ్రేటర్లో కేసులు సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో సుమారు 70శాతానికి పైగా ఎసింప్టమాటిక్ కేసులు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల పాజిటివ్ ఉన్నా, వారికి వైరస్ సోకినట్లు తెలియకపోవడంతో ఊర్లకు వెళ్లిన బాధితులు వైరస్ను మోసుకెళ్లినట్లు వైద్యనిపుణులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా పండుగ నేపథ్యంలో సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించడం తదితర కారణాల వల్ల జిల్లాల్లో కేసులు పెరగడంతో పాటు తిరిగి జిల్లాల నుంచి నగరానికి కూడా వైరస్ను మోసుకొచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్యనిపుణులు.
తీవ్రంగా పెరిగే అవకాశం
పండుగ సీజన్ కావడంతో ప్రజలు ఊర్లకు ప్రయాణాలు చేయడం, మూడు, నాలుగు రోజుల్లో నగరానికి తిరుగు ప్రయాణం కానుండటంతో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నట్లు పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్ సోకిన నాలుగైదు రోజుల తరువాతనే లక్షణాలు బయట పడతాయి. ఈ క్రమంలో రాగల వారం పదిహేను రోజుల్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరగవచ్చని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్కు లేనిది బయటకు అడుగు పెట్టవద్దని, సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకూడదని తెలుపుతున్నారు.
‘గాంధీ’లో 103కు చేరిన కరోనా బాధితులు
బన్సీలాల్పేట్, జనవరి 11 : గాంధీ దవాఖానలో కరోనా బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పాజిటివ్ కేసులు 103కు చేరగా.. అందులో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. బుధ, గురువారం 50మంది కొత్తగా చేరగా.. అందులో కొందరు సీరియస్గా ఉన్నారని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు నిర్వహించిన జూమ్ మీటింగ్లో తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, తమకు అనేక ముఖ్యమైన సూచనలు చేశారని, వాటిని తప్పకుండా అమలుచేస్తామని తెలిపారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో 600 ఐసీయూ, 600 ఆక్సిజన్, 600 సాధారణ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, గంటకు ఏడు టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే ఎనిమిది ప్లాంట్లు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు.