సికింద్రాబాద్, జనవరి 13: కంటోన్మెంట్ పరిధిలోని న్యూ బోయిన్పల్లి ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో రంగవల్లులు వన్నెతెచ్చాయి. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం న్యూ బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.
ఈ పోటీల్లో మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. వివిధ ఆకృతులు, కలశాలు, గొబ్బెమ్మలను అలంకరించారు. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, రూపారెడ్డి దంపతులు మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన వారితో పాటు పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. దీంతో పాటు బోర్డు సభ్యుడిగా ఎంపికై ఏడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానికులు జక్కుల మహేశ్వర్రెడ్డిని సత్కరించారు.
విజేతలు వీరే…
ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి కే. సౌంద ర్య, ద్వితీయ బహుమతి టి. మీనా, తృతీయ బహుమతి టి. దివ్య, ప్రోత్సాహక బహుమతులు కే. సుజాత, ఎన్. రజిని, జి. నందిని ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతులు అందజేశారు.
కంటోన్మెంట్ డిపోలో…
మారేడ్పల్లి, జనవరి 13: కంటోన్మెంట్ డిపోలో నిర్వహించి ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది, పాల్గొని ముగ్గులు వేశారు. డిపో మేనేజర్ కె. కృష్ణమూర్తి ముగ్గులను పరిశీలించి మహిళలను అభినందించారు.