సిటీబ్యూరో : బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లలో కొందరు మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారు. పోలీసుల తనిఖీలోపదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రులు విద్యా సంస్థల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్టైం డ్రైవర్లను నియమించుకుని వారి బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విద్యా సంస్థలు చెలరేగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కాబోతుండటంతో బస్సులన్నీ ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లో 1247, మేడ్చల్ మల్కాజిగిరిలో 6058, రంగారెడ్డిలో 6197 బస్సులు ఉన్నాయి. మొత్తం 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీరికి ఆర్టీఏ ప్రతీ స్కూల్ ప్రారంభానికి ముందర రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామక సామార్థ్యం, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస్సు కండిషన్, ఆ బస్సుపై ఉండాల్సిన రంగులు, అక్షరాలు తదితర అన్నీ అంశాలపై సూచనలు ఇస్తారు. ఇప్పటి వరకు సుమారు 3వేల విద్యా సంస్థల బస్సులు అసలు ఫిట్నెస్ పరీక్షకే రాలేదని అధికారులు చెబుతున్నారు. అలాంటి విద్యా సంస్థల బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 30లోపు ఫిట్నెస్ ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు.