ప్రపంచ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ది.. అద్భుత ప్రతిభ కలిగిన ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించింది. వందేండ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీ.. ఎప్పటికప్పుడు ఆధునికతను అందిపుచ్చుకుంటూ.. పురోగమిస్తున్నది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధనలతో పాటు వసతి సదుపాయాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయంలో రూ. 130 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులోభాగంగానే అత్యాధునిక వసతులతో రెండు హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ. 39.50 కోట్లతో చేపట్టిన ఒకటి నిర్మాణంలో ఉండగా, అంతే మొత్తంతో మరో హాస్టల్ నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయనున్నారు. రూ. 50 కోట్లతో సుందరమైన పరిపాలన భవనాన్ని సైతం కడుతున్నారు. ఓయూ వందేండ్లు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా రూ.1.50 కోట్లతోక్యాంపస్లో పైలాన్ పనులూ చేపట్టారు. మరో వైపు సైఫాబాద్ పీజీ సైన్స్ కాలేజీలో మరో హాస్టల్, నాలుగు కోట్లతో అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యా బోధనతో పాటు వసతులు కల్పించాలన్న సంకల్పంతో రూ.130 కోట్ల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఓయూలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో రెండు హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నారు. 500 మంది విద్యార్థుల అవసరాలు తీర్చేలా జీ +2 బాయ్స్ హాస్టల్కు విద్యా శాఖ మంత్రి డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. అలాగే 500 మంది విద్యార్థులకు సరిపోయేలా… ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ హాస్టల్ను రూ.39.50 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్తో నిర్మించబోతున్నారు. సైఫాబాద్ పీజీ కాలేజీలో బాలికల కోసం ఇప్పుడున్న కంప్యూటర్ సైన్స్ బ్లాక్ను బాలికల హాస్టల్గా మారుస్తున్నారు. మరో 4 కోట్ల నిధులతో సైఫాబాద్ పీజీ కాలేజీ ఆఫ్ సైన్స్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
కొనసాగుతున్న పరిపాలనా భవన నిర్మాణం..
వందేండ్ల చరిత్ర కలిగిన ఓయూలో అత్యాధునిక హంగులు, ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూ.50 కోట్లతో పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని పది నెలల్లోనే పూర్తి చేసేలా తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్లూఐడీసీ) ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయని ఓయూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనాన్ని కొత్త భవనంలోకి మార్చిన తర్వాత దానిని బాలికల హాస్టల్గా మారుస్తామని తెలిపారు.
త్వరలోనే ఓయూ వందేండ్ల పైలాన్ పనులు షురూ..
ఉస్మానియా యూనివర్సిటీ వందేండ్లు పూర్తి చేసుకున్నది. దానిని చరిత్రలో గుర్తుండి పోయే విధంగా భారీ స్థాయిలో పైలాన్ నిర్మించడానికి ఈ నెలలో పనులు ప్రారంభించనున్నారు. అందుకోసం రూ.1.50 కోట్లు ప్రతిపాదించారు. అయితే పైలాన్ నిర్మాణం కోసం క్యాంపస్లోని సైన్స్ కాలేజీ మార్గంలో ఎకరా స్థలం కేటాయించారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు.