Crime News | దుండిగల్, ఏప్రిల్ 10: ప్రగతినగర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసులోని నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ హత్యలో మొత్తం 13 మంది పాల్గొనగా.. వీరిలో నలుగురు మైనర్లు, ఓ రౌడీషీటర్ ఉన్నారు. గతేడాది అక్టోబర్ 24న ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన తరుణ్రాయ్ హత్యకు ప్రతీకారంగానే ప్రగతినగర్లో ఈ హత్య జరిగినట్లు స్పష్టం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన తేజాస్ అలియాస్ తేజు అలియాస్ డీల్ (21) కుటుంబం రెండు దశాబ్దాల కిందట నగరానికి వచ్చి, బోరబండలో స్థిరపడింది. తేజు తండ్రి చనిపోయాడు. తల్లివద్ద ఉంటూ.. చిన్ననాటి నుంచి అవారాగా తిరిగాడు. ఇదిలా ఉండగా.. స్థానికంగా ఉండే షేక్ షరీఫ్, అభిషేక్, తేజు, నాగరాజు, రాహుల్, రాబిన్బెన్సి గతేడాది అక్టోబర్ 24న (దసరా పండుగ రోజున) ఎస్ఆర్నగర్లో జరిగిన తరుణ్రాయ్ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు. ఇందులో షేక్షరీఫ్, తేజు రెండు నెలల కిందట బెయిల్పై విడుదలయ్యారు. బీకే గూడలో ఉంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని భావించి.. మకాంను నిజాంపేట పరిధిలోని ప్రగతినగర్కు మార్చాడు.
తరుణ్రాయ్ను హత్యచేసిన తేజును ఎలాగైనా మట్టుబెట్టాలని తరుణ్రాయ్ బంధువు రోహిత్ తన అనుచరులు దినేశ్, తదితరులతో కలిసి పథకం రచించాడు. ఇందుకోసం శివప్ప అనే వ్యక్తిని రంగంలోకి దింపాడు. తేజు చిరునామా తెలుసుకోవడంతోపాటు అతడితో స్నేహంగా ఉండాలని, అవకాశం చిక్కగానే సమాచారమివ్వాలని సూచించారు. దీంతో శివప్ప కొద్ది రోజులుగా తేజుతో స్నేహంగానే ఉంటూ.. ఎప్పటికప్పుడు అతడి సమాచారాన్ని ప్రత్యర్థి వర్గానికి చేరవేస్తున్నాడు. తేజు తల్లి ఐదు రోజుల కిందటే వేములవాడకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో తేజు, మహేశ్, శివప్ప, మహేశ్ కలిసి తేజు ఇంట్లో కూర్చుని మద్యం తాగారు. ఇదే విషయాన్ని శివప్ప ఫోన్ ద్వారా రోహిత్కు చెప్పడంతో పాటు వారున్న లోకేషన్ను కూడా షేర్ చేశాడు. దీంతో ఆదివారం తెల్లవారు జామున రోహిత్, సమీర్, సిద్దేశ్వర్ నాయక్, గణేశ్, సునీల్, రాహుల్, తిరుమలేశ్, మహేశ్తో పాటు మరో ముగ్గురు మైనర్లు బైక్లపై ప్రగతినగర్కు చేరుకున్నారు. వీరిలో సమీర్, సిద్ధేశ్వర్ నాయక్తో పాటు ఓ మైనర్ తేజు నివాసముంటున్న ఇంటి కింద కాపు కాస్తుండగా, రోహిత్, దినేశ్, తిరుమల్, రాహుల్, ప్రతీక్, సునీల్, గణేశ్, సంతోష్, శ్రీకర్ పరిసర ప్రాంతాలను గమనిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున (ఏప్రిల్ 8న) 4 గంటల సమయంలో ముందస్తు పథకంలో భాగంగా సిగరేట్ పేరుతో తేజు, మహేశ్ను శివప్ప ఇంటిపై నుంచి కిందకు తీసుకువచ్చాడు.
అనంతరం శివప్ప.. తేజును తన స్కూటీపై కూర్చోబెట్టుకుని రోడ్డుపైకి వచ్చి.. బైక్ను సమీర్ ముందు ఆపాడు. ప్రమాదం పసిగట్టిన తేజు తప్పించుకునేందుకు కొంతదూరం పరిగెత్తాడు. వెంబడించిన సిద్దేశ్వర్ నాయక్, మరో బాలుడు కత్తులతో కడుపులో పొడవగా.. సమీర్ బండరాయితో తేజు తలపై మోదాడు. తేజు కిందపడిపోయాడు. శివప్ప కత్తితో తేజు మెడను నరికి వేయగా.. అక్కడికక్కడే మరణించాడు. తేజు మరణం తర్వాత.. నిందితులు బైక్లపై తిరిగి వెళ్తూ.. హత్య జరిగిన చోటుతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో బైక్లపై తిరిగి వీడియోలు తీసి ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.