మేడ్చల్, మే 21 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యం కొనుగోళ్లు ఉపందుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 13,310 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేయగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందును అనుగుణంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రైతుల నుంచి రూ.4 కోట్ల 80 లక్షల విలువైన 23వేల 312 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా ఫౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాజేందర్ తెలిపారు. రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తప్పని సరిగా పాస్ పుస్తకాలు, ఆధార్కార్డు, బ్యాంకు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం మొదటి రకానికి రూ.2060, రెండవ రకానికి రూ.2040 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించగా.. ధాన్యం కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
చివరి గింజ వరకు కొనుగోలు
రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే వరకు కేంద్రాలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రతి రోజు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజేందర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూస్తున్నారు.