సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
కోటి 73 లక్షల 60వేల 502 రూపాయల విలువజేసే ఇతర వస్తువులు, రూ.19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని కూడా పట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు. 141 మందిపై కేసులు నమోదు చేసి, 136 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 280 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించామన్నారు. 185 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు చెప్పారు. లైసెన్స్ ఉన్న 2409 ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13.13 లక్షల నగదు, రూ.34 వేల విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు చెప్పారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నగదు, ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించామని, నలుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు.