రైతుబంధు వారోత్సవాలలో మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, జనవరి 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, బోడుప్పల్, పోచారం, దమ్మాయిగూడ, జవహర్నగర్లలో మంగళవారం ఘనంగా రైతుబంధు వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన మంత్రి మల్లారెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ గుర్తించారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్కు ఇస్తున్న ప్రజల మద్దతు చూసి బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. భవిష్యత్లో బీజేపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.
విజయవంతంగా వారోత్సవాలు..
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలు విజయవంతమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీలలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలకు ప్రజలు స్వచ్ఛందగా హాజరై ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు.