మియాపూర్, జనవరి 11: ఐటీ రంగానికి నిలయమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామి గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు.. ఇందుకనుగుణంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మంత్రి కేటీఆర్ను కోరారు. మంగళవారం కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవితో కలిసి విప్ గాంధీ ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సివరేజీ, రోడ్లు, లింక్ రోడ్లు, చెరువుల సుందరీకరణ, శ్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధి, నల్లగండ్ల ఎస్టీపీ నిర్మాణం, తాగునీటి నెట్వర్క్ విస్తరణకు అదనపు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే వేలాది కోట్లతో మౌలిక వసతులు కల్పించామని.. వాటిని మరింతగా విస్తరించేందుకు తోడ్పాటు అందించాలని మంత్రి కేటీఆర్ను కోరామన్నారు. ఈ వినతిపై మంత్రి కేటీఆర్ స్పందించి త్వరలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు.