కుత్బుల్లాపూర్: వైద్య విద్యార్హతలు లేకుండా క్ల్లినిక్లు నిర్వహిస్తున్న 10 మంది నకిలీ డాక్టర్లను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, పేట్ బషీరాబాద్ పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖా అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అరెస్ట్ చేశారు. వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వెల్ల్లడించారు. నిందితులు గుర్తింపు పొందిన వైద్య డిగ్రీలు లేకుండానే సాధారణ వైద్యంతో పాటు చిన్నపిల్లలకు కూడా వైద్యం అందిస్తున్నారని చెప్పారు.
కొన్ని క్లినిక్లలో బెడ్లు ఏర్పాటు చేసి రోగులను అడ్మిట్ చేసుకోవడం, అనుభవం లేకుండా స్లైన్లు ఎక్కించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి క్లినిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని బుచ్చయ్య, సుధాకర్ చారి, అంజగౌడ్, రామావత్ ప్రకాశ్, మేకల అక్షయ్కుమార్, కె.నారాయణ, జి.ప్రహ్లాద్, బుచ్చిబాబు, ఎస్.శ్రీనివాసరావు, పి.గంగారామ్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.