శేరిలింగంపల్లి, డిసెంబర్ 26: గచ్చిబౌలి విప్రో సర్కిల్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్లైట్ పడటంతో సిగ్నల్ వద్ద ఆగిన మూడు కార్లను, మూడు ద్విచక్ర వాహనాలను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా విషాదం సృష్టించిన ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానామెట్లోని ఓ నిర్మాణ సంస్థ వద్ద బండరాళ్లను లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని ఓ క్రషర్లో అన్లోడ్ చేసేందుకు ఆదివారం రాత్రి బయలుదేరింది.
అర్ధరాత్రి సమయంలో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ మీదుగా నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని విప్రో సర్కిల్కు చేరుకుంది. ఆ సమయంలో విప్రో సర్కిల్లో రెడ్ సిగ్నల్ పడటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు సిగ్నల్ వద్ద ఆగి ఉన్నాయి. వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు (స్విఫ్ట్, ఇండిగో, ఐ10) నుజ్జనుజ్జయ్యాయి. అదే వేగంతో గౌలిదొడ్డి వైపు నుంచి విప్రో జంక్షన్ మీదుగా వెళ్తున్న మరో టిప్పర్కు ఢీకొట్టి ఆగింది.
ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
స్విప్టు కారులో బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి సురక్షితంగా బయటపడ్డాడు. ఐ20 కారులో ఉన్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, వారి కుటుంబ సభ్యులు సాహితీ, సుదీప్తీ కూడా తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇండిగో క్యాబ్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కార్లను ఢీకొడుతూ ముందుకు దూసుకెళ్లిన టిప్పర్.. సిగ్నల్ వద్ద ఆగివున్న మరో మూడు ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న నాంపల్లి ప్రాంతానికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ సయ్యద్ నసీర్ హుస్సేన్ (30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడికాలు, సుబెంద్ దాస్ ఎడమకాలు విరిగాయి. గాయపడిన వారు కాంటినెంటల్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. టిప్పర్ క్యాబిన్లో డ్రైవర్ పక్కన కూర్చున్న సూపర్వైజర్ ఎండీ ఖలీం ఇరుక్కుపోయాడు. దీంతో అతడి కాలు విరిగిపోవడంతో కొండాపూర్లోని జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.