సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో గుర్రపు పందాలు నిర్వహిస్తున్న ముఠాతో పాటు పంటర్లను రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం రెడ్డిపాలెనికి చెందిన తిరుమల్రెడ్డి జోజిరెడ్డి మీర్పేట్లోని నందనవనంలో నివాసముంటున్నాడు. ఆన్లైన్లో గుర్రపు పందాలు కాసేందుకు తెలిసిన వారితో వాట్సాప్ గ్రూప్ను తయారు చేశాడు. మహబూబ్నగర్ జిల్లా కొందూర్గు మండలం లూర్ధునగర్కు చెందిన అదూరి జోసెఫ్రెడ్డిని సహా నిర్వాహకుడిగా, వరంగల్కు చెందిన ప్రాంక్లిన్ కోమరెడ్డిని అకౌంటెంట్గా నియమించుకున్నాడు. బెట్365 యాప్లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని.. హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, ముంబై, కోల్కతా, చెన్నైలలో జరిగే రేస్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకునేవాడు. ఫలాన గుర్రం ఆ రోజు రేసింగ్లో ఉంటుందంటూ.. స్క్రీన్ షాట్స్ తీసి, తమ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేసి..ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించేవాడు. గెలిచిన గుర్రంపై బెట్టింగ్ పెట్టిన వారికి డబ్బులు ఇస్తారు. విశ్వసనీయ సమాచారంతో నందనవనంలోని జోజిరెడ్డి ఇంటిపై ఎస్వోటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బృందం దాడి చేసింది. ముగ్గురు నిర్వాహకులతో పాటు పంటర్లు మాధవ్రెడ్డి, రాంచంద్రారెడ్డి పట్టుబడగా, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లికి చెందిన ప్రతాప్రెడ్డి పరారీలో ఉన్నాడు. అరెస్టయిన పంటర్లలో మాధవరెడ్డి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు.