సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ): ‘ఆకాశవాణి.. హైదరాబాద్ కేంద్రం..’ అని వినగానే ఒక్కసారిగా చెవులు రిక్కిస్తాం. ఏం చెబుతారోనన్న ఉత్సుకత ప్రదర్శిస్తాం. వార్తలు.. ముచ్చట్లు..పాటలు.. ఆటలు..నాటికలు.. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను రంగరించి శ్రోతలను కట్టిపడేసిన ఆకాశవాణి-యువవాణి మూగబోయింది. దశాబ్దాలుగా వినూత్నమైన కార్యక్రమాలతో జనానికి చేరువైన బీ కేంద్రం ఉలుకూ పలుకూ లేకుండా మూతబడిపోయింది.
ఆకాశవాణి హైదరాబాద్ రేడియో స్టేషన్ కోట్లాది శ్రోతల హృదయాలను రంజింపజేసిన అత్యద్భుతమైన వేదిక. కొన్నేండ్లుగా (హైదరాబాద్ ‘ఏ’ స్టేషన్ ‘జనరల్’) మధురమైన గీతాలతో, నాటికలు, ఆరోగ్యం, వ్యవసాయమే కాకుండా వార్తలు ఇలా పలు రంగాలకు సంబంధించిన విషయాలను స్పష్టంగా అర్థమయ్యే విధంగా వివరిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఆకాశవాణిలో భాగమైన హైదరాబాద్ (బి) రేడియో స్టేషన్ ‘యువవాణి’ పేరుతో 1972లో ప్రారంభమైంది. ప్రస్తుతం అది నిర్వహణ భారంతో మూగబోయింది. చెన్నైతో పాటు హైదరాబాద్ స్టేషన్లను ఆలిండియా రేడియో గత శనివారం నిలిపివేసింది. నిర్విరామంగా సేవలందించిన ఘనత హైదరాబాద్ ‘బి’ స్టేషన్ది. 1972లో నవంబర్ 13న ప్రారంభమైన రేడియో.. లెక్క లేనంత మంది శ్రోతల హృదయాలను రంజింపజేసింది.
మూగబోయిన విజ్ఞాన ‘యువవాణి’
‘యువవాణి’ తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో వినోదాత్మక విద్యను అందించేదని శ్రోతలు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ చానల్గా అందరికీ సుపరిచితంగా మారిందన్నారు. ‘బి’ కేంద్రంలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు విజ్ఞానానికి (ఎడ్యుకేషన్) సంబంధించిన అంశాలపై కార్యక్రమాలు నిర్వహించేవారు. చదువుకుంటూ పని చేయాలని 25 ఏండ్లలోపు యువత (అనౌన్సర్లు) ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. వారికి ప్రతినెలా ఆరు డ్యూటీల చొప్పున ఉపాధిని కల్పించేవారు. నెలకు రూ.3 నుంచి రూ.4 వేల గౌరవ వేతనాన్ని అందజేసేవారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ఇందులో పనిచేసేవారని ఇంతకు ముందు ఉన్నవారు తెలిపారు. ప్రస్తుతం, ఆయా వర్సిటీల విద్యార్థులు ఉపాధితో పాటు వారి సృజనాత్మకతను కోల్పోనున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ‘బి’ పరిధిలో ఆదిలాబాద్, హైదరాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో రేడియో స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 150 మంది యువతకు అన్యాయం జరిగిందని వెల్లడించారు.
గతంలో మూసివేసిన కొన్ని స్టేషన్లు
మీడియం వేవ్లో ఉన్న ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ చానల్ని కూడా కొన్ని రోజుల క్రితం నిలిపివేశారు. గత ఏడాది డిసెంబర్ 31న శ్రీనగర్, జైపూర్, ఒడిశా పరిధిలోని షార్ట్ వేవ్ చానల్స్ను కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రసార భారతి నిబంధనల ప్రకారం, పాత ట్రాన్స్మిటర్లు వాటి సాధారణ సర్వీస్ కంటే ఎక్కువ సేవలందించిన వాటిని
నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
నిర్వహణ భారంతోనే మూసివేత
కేంద్రం నిర్వహణ భారం, అనవసర ఖర్చులు పెరగడంతోనే హైదరాబాద్, చెన్నై ‘బి’ స్టేషన్లను మూసివేయాల్సి వచ్చిందని ఆలిండియా రేడియో ప్రకటించింది. స్థానిక ప్రకటనలు, స్టేషన్ గుర్తింపు లేకుండా కూడా కార్యక్రమాలు నిర్వహించామని, అది ఎంతో భారంగా మారి అనవసర ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు.