సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఫ్రంట్లైన్ వారియర్స్పై మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రధానంగా దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. గడిచిన మూడు నాలుగు రోజుల్లోనే నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో కరోనా బారిన పడిన వైద్య సిబ్బంది సంఖ్య 500కు చేరువలో ఉండటం కలకలం రేపుతోంది. నగరంలోని ఉస్మానియా దవాఖానలో రెండు మూడు రోజుల్లోనే అత్యధికంగా 159 మంది సిబ్బంది కరోనా బారిన పడగా, అందులో 124 మంది వైద్యులే ఉండటం గమనార్హం. 19మంది నర్సింగ్ సిబ్బంది, ఎనిమిది మంది టెక్నీషియన్లతో పాటు ఇతర సిబ్బంది పాజిటివ్కు గురయ్యారు. గాంధీ దవాఖానలో కూడా రెండు రోజుల్లోనే 70 మంది సిబ్బంది వైరస్ బారినపడ్డారు. ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానలో సోమవారం ఒక్కరోజే తొమ్మిది మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు 57 మంది మానసిక రోగులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిమ్స్లో 10 మందికి పైగా, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, పేట్లబుర్జ్, నిలోఫర్, టిమ్స్, కోటి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ తదితర టీచింగ్ హాస్పిటల్స్లో సైతం పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.
రోగి వెంట ఒక్కరే రావాలి..
కరోనా వ్యాప్తికి దవాఖానలు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగుల వెంట వచ్చే సహాయకులు సైతం వైరస్ బారిన పడుతూ వారి కుటుంబ సభ్యులకు పరోక్షంగా వైరస్ను అంటిస్తున్నట్లు వైద్యాధికారులు వాపోతున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఓపీ కోసం వచ్చే వారివెంట ఒక్కరు మాత్రమే రావాలని, ఇన్ పేషెంట్ వెంట కూడా ఒక్కరే సహాయకుడిగా ఉండాలని సూచిస్తున్నారు. దవాఖానల నుంచి ఇండ్లకు వెళ్లిన వెంటనే స్నానం చేసి, చేతులకు శానిటైజర్ పెట్టుకోవాలని, చిన్నపిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పోలీసు శాఖలో..
పోలీసు శాఖను థర్డ్వేవ్ కలవర పెడుతోంది. ఏ ఠాణాలో చూసినా ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 698 కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదు దారులపై ఆంక్షలు విధించారు. ఫిర్యాదు చేయడానికి ఒక్కరు మాత్రమే ఠాణాకు రావాలన్న నిబంధనలు విధించారు.
ఆర్టీసీలో 4వ గేర్లో విరుచుకుపడుతున్న కేసులు..
ఆర్టీసీలో కరోనా వైరస్ 4వ గేర్లో విరుచుకుపడుతుంది. ఏ డిపోలో చూసినా రోజుకు పదుల సంఖ్యలో సిబ్బంది పాజిటివ్ బారిన పడుతున్నారు. ఆర్టీసీ గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు దాదాపు 50 మంది వరకు సిబ్బంది కరోనాకు గురవుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆర్టీసీలో కరోనా అలజడి ఆందోళన కలిగిస్తోంది.