సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూనివర్సిటీలలో బీటెక్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ర్యాగింగ్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. ర్యాగింగ్ వల్ల ఎవరూ కూడా మానసికంగా కుంగిపోకుండా, సీనియర్ల ర్యాగింగ్ నుంచి జూనియర్లను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందు లో భాగంగా యూనివర్సిటీలలో కొత్తగా తరగతులు, కాలేజీల వారీగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పా టు చేస్తున్నారు. వైస్చాన్స్లర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, హాస్టల్ నిర్వహణ అధికారులతో పాటు విద్యార్థులు ఉంటారు. ఈ గ్రూప్లో ర్యాగింగ్ చేస్తున్న వారి వివరాలు, ప్లేస్ షేర్ చేస్తే.. అధికారులు వెంటనే స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
యూనివర్సిటీలలో ఇప్పటికే టోల్ఫ్రీ నంబర్లు, హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ అధికారుల ఫోన్ నంబర్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్తో పాటు ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీలలో కూడా ర్యాగింగ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీ యాజమాన్యాలకు యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కాలేజీ క్యాంపస్లో యాంటీ ర్యాగింగ్ బోర్డులు, స్లోగన్లు ఏర్పాటు చేస్తున్నారు.
యూనివర్సిటీల్లో ర్యాగింగ్ లేకుండా చూడాలి. అందరూ స్నేహపూర్వక వాతావరణంలో కాలేజీ చదువులు కొనసాగించాలి. అందుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. కాలేజీ ఆవరణలోనే కాకుండా హాస్టళ్లలో కూడా ర్యాగింగ్ చేయవద్దు. – ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, ఓయూ వైస్ చాన్స్లర్