సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్పై శనివారం రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ (ఆదివారం) తెల్లవారుజాము 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. బేగంపేట్, లంగర్హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని మిగతా ఫ్లై ఓవర్లన్నీ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మూసి వేస్తున్నట్లు సీపీ తెలిపారు.
ఒకటో తేదీ తెల్లవారుజాము 2 గంటల వరకు బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ అండ్ నెగ్లెజెంట్ డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలను సీరియస్గా తీసుకుంటున్నామని, వీటిని అడ్డుకోవడం కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీపీ వివరించారు. న్యూ ఇయర్ వేడుకలను ఇన్సిండెట్ ఫ్రీగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, వాహనదారులు కూడా పోలీసులకు సహకరించి ప్రమాద రహితంగా వేడుకలను పూర్తి చేయాలని సీపీ పిలుపునిచ్చారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఖైరతాబాద్ వీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్మార్గ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. వాహనాలను రాజ్భవన్ రోడ్డులోకి మళ్లిస్తారు.