హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు పంథా మారుస్తున్నారు. ఇప్పటికే వివిధ మార్గాల్లో సైబర్ దాడులకు పాల్పడుతున్న కేటుగాళ్లు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని సైతం వాడుకొంటున్నారు.
‘డీప్ ఫేక్స్’గా పిలిచే ఈ తరహా నేరాలు మున్ముందు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు ప్రముఖ సైబర్ సెక్యురిటీ కంపెనీలు వీఎంవేర్, పాలోఆల్టో తమ సర్వే నివేదికలో హెచ్చరించాయి. నిరుడు మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు నిర్వహించిన ఈ సంస్థలు ‘వీఎంవేర్ 2022 గ్లోబల్ ఇన్సిడెంట్ థ్రెట్ రెస్పాన్స్ రిపోర్టు’ పేరిట ఇటీవల ఈ నివేదికను విడుదల చేశాయి.
సైబర్ నేరాల్లో దాదాపు 70% వరకు రాన్సమ్వేర్ దాడులు, బిజినెస్ ఈ-మెయిళ్లపై దాడులు ఉన్నట్టు తేల్చాయి. నిరుటితో పోలిస్తే ఈ తరహా నేరాలు 13% పెరిగాయని వెల్లడించింది. ప్రధానంగా రాజకీయ అంశాలను ప్రభావితం చేసేందుకు దీనిని వాడుతున్నట్టు తెలిపింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) వద్ద నమోదవుతున్న కేసుల్లోనూ డీప్ ఫేక్స్, వ్యక్తిగత సమాచార చౌర్యం కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొన్నది.