విదేశాలను తలపించేలా వ్యవస్థ..వేగంగా ప్రయాణం..అతి తక్కువ భూసేకరణ..కాలుష్య రహితంగా ఉండే సరికొత్త ప్రజా రవాణా వ్యవస్థను నగరంలో అందుబాటులోకి తెచ్చే కసరత్తు వేగంగా సాగుతున్నది. గ్రేటర్ ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతుండంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెట్రో తరహాలో ట్రామ్వే, రోప్వే రవాణా వ్యవస్థను తీసుకొచ్చేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఉమ్టా) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే పేరొందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు గ్రీన్సిగ్నల్ ఇస్తే గ్రేటర్ పరిధిలో మెట్రోరైలు తరహాలో కొత్తగా ట్రామ్వే,రోప్వేల రూపంలో నిర్ణీత మార్గాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టులకు వ్యయం తక్కువ. భూసేకరణ సమస్య కూడా పెద్దగా ఉండదు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండే ట్రామ్వే, రోప్వే ప్రయాణాలు ఆర్టీసీ బస్సు, ఆటోలు, ఇతర వ్యక్తిగత వాహనాలకు ప్రత్యామ్నాయంగా మారుతుంది.
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా, భవిష్యత్లో తలెత్తే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తూ … ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా హాయిగా సాగేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే నగరానికి అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. అదే తరహాలో భవిష్యత్తులో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్వేలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు మొదలైంది
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఉమ్టా) కోర్ సిటీలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపై పలు సంస్థలతో కలిసి అధ్యయం చేసి, ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్త్-సౌత్ మొబిలిటీ కారిడార్, ఈస్ట్-వెస్ట్ కారిడార్ల పేరుతో పలు మార్గాల్లో కొత్త తరం ట్రామ్ వే, రోప్ వే మార్గాలను ఏర్పాటు చేయాలని నివేదికను రూపొందించారు. ఎక్కడ ఎలాంటి సాధనం అవసరమో దాన్ని ఏర్పాటు చేసేలా ఉమ్టా బృందం అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ నిపుణుల బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయం చేసింది. దీనికి సంబంధించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను ఇతర ప్రతిపాదనలను ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ప్రభుత్వం ఆమోదిస్తే గ్రేటర్ పరిధిలో మెట్రో రైలు తరహాలో సరికొత్తగా ట్రామ్ వే, రోప్ వేల రూపంలో నిర్ణీత మార్గాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కార్యరూపం దాల్చుస్తుంది. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఇలాంటి ఆధునిక ప్రజా రవాణా సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు ట్రామ్వే, రోప్వే వంటి ప్రాజెక్టులకు తక్కువ వ్యయంతో, భూసేకరణ సమస్యలు తక్కువగా ఉంటాయి. నగర శివార్లతో పోల్చితే కోర్ సిటీలో భవిష్యత్లో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే ఇలాంటి ప్రజా రవాణా వ్యవస్థ తప్పని అవసరంగా మారాయని పట్టణ ప్రణాళికా నిపుణులు పేర్కొంటున్నారు.
నార్త్-సౌత్ మొబిలిటీ కారిడార్లో భాగంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి చార్మినార్ వరకు 10.4 కి.మీ మేర న్యూ జనరేషన్ ట్రామ్వేను ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో గ్రీన్లైన్ (నాగోల్-రాయదుర్గం కారిడార్-3)తో అనుసంధానం చేస్తారు. అదే విధంగా పాతబస్తీలో నిర్మించే మెట్రో మార్గంతో శాలిబండ వద్ద అనుసంధానం చేస్తారు. 2030 నాటికి ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజు మూడు లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎంజీబీఎస్ నుంచి జూ పార్కు వరకు సుమారు 5.5 కి.మీ మేర మూసీనది వెంబడి రోప్ వేను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మార్గాన్ని ఎంజీబీఎస్ వద్దనున్న మెట్రో స్టేషన్తో అనుసంధానం చేస్తారు. అదే విధంగా ఈస్ట్-వెస్ట్ కారిడార్లో భాగంగా ఖైరతాబాద్ – సచివాలయం – అసెంబ్లీ – ప్యారడైజ్ మార్గంలో సుమారు 8.4 కి.మీ మేర ట్రామ్ వేను నిర్మించాలని ప్రతిపాదించారు.
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి క్షేత్రా న్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నగరం నుంచి యాదాద్రికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న రాయగిరి నుంచి యాదగిరిగుట్ట ఆలయం వరకు ఉన్న ప్రాంతా న్ని టూరిజం కారిడార్గా పరిగణించి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రాయగిరి వద్ద రైల్వే స్టేషన్ భవిష్యత్తులో ఎంఎంటీఎస్ స్టేషన్గా మారి సబర్బన్ రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో అక్కడి దాకా రైళ్లలో వచ్చే ప్రయాణికులు యాదగిరి గుట్ట ఆలయానికి వెళ్లేందుకు రోప్ వేను 5.3 కి.మీ మేర నిర్మించాలని గుర్తించారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉన్న గుట్టలను కలుపుతూ ఎకో టూరిజం పార్కుగా తీర్చిద్దేలని నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాకా విస్తరించగా, 2041 నాటికి ఔటర్ దాటి మరో 40-50 కి.మీ వరకు విస్తరించే అవకాశం ఉండటంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే పట్టణ ప్రజా రవాణా వ్యవస్థ ఆధునికంగా ఉం డాలని ట్రామ్ వే, రోప్ వేలను ఏర్పాటు చేయాలని అధ్యయనం చేసిన సంస్థలు సిఫారసులు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో పనిచేస్తున్న హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థపై జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది.