సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఆ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజకవర్గంలోని బూర్గుల గ్రామ ప్రజల ఆరోగ్యానికి ‘లయన్స్’ భరోసా కల్పిస్తున్నది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ ఎన్ఫీల్డ్ యూకేతో కలిసి బూర్గుల గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు అక్కడ అన్ని హంగులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దారు.ఇటీవల డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దామోదర్, మాజీ సర్పంచ్ బూర్గుల సుమన, లయన్ డాక్టర్ శ్రీకాంత్ మందుమూలతో కలిసి ప్రారంభించారు.
స్ఫూర్తిగా నిలిచిన బూర్గుల కుటుంబం
స్వాతంత్య్ర సమరయోధులు బూర్గుల వెంకటేశ్వర్ రావు తాను పుట్టి పెరిగిన గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన పెద్దకుమారుడు,అప్పటి సర్పంచ్ బూర్గుల నర్సింగ రావు ఇక్కడ హైస్కూల్ ఏర్పాటు కోసం ఏడెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దివంగత డాక్టర్ సుగుణారామ్మోన్తో కలిసి అనేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 1990లోనే నర్సింగరావు, సుగుణరామ్మోన్లు పీహెచ్సీని నిర్మించాలని సంకల్పించారు. వారు చేసిన కృషి ఫలితంగా 2001 జనవరిలో ఇక్కడ పీహెచ్సీ అందుబాటులోకి వచ్చింది.
అన్ని హంగులతో….
ఈ పీహెచ్సీ 12 బెడ్ల సామర్థ్యం కలిగి ఉంది. అన్ని రకాల మందులు, సదుపాయాలు అందుబాటులో ఉంచారు. 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండే లా ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులకు సురక్షితమైన ప్రసూతి కోసం సౌకర్యాలు కల్పిం చారు. ఈ పీహెచ్సీ చుట్టుపక్కల తండాల్లోని ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని లయన్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.