సైదాబాద్, జనవరి 17:గురి చూసి కొట్టాలి. లక్ష్యాన్ని ఛేదించాలి. పతకాన్ని సాధించాలి. ఇవి తప్ప వేరే ధ్యాసే లేదు పదహారేండ్ల మారియాకు. సింధూ, సైనా, మిథాలీ వంటి క్రీడాకారిణులను ఆదర్శంగా తీసుకుని తాను ఎంచుకున్న షూటింగ్లో విజయాలు సాధిస్తున్నది. ఉహ తెలియని వయసులోనే రైఫిల్ చేతబట్టిన మారియా తనిమ్ పోటీల్లో అంచనాలకు మించి రాణిస్తున్నది. అసమాన ప్రతిభను ప్రదర్శిస్తూ పలువురి ప్రశంసలను పొందుతుంది. ఆమె గన్తో గురిపెట్టిందంటే కచ్చితంగా పతకం దక్కాల్సిందే..
పాతబస్తీ సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన 16 ఏండ్ల మారియా తనీమ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నది. సరిగ్గా మూడేండ్ల క్రితం 2018లో సైదాబాద్లోని బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వేసవి సెలవుల్లో క్రీడా శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని, తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించడంతో కొంతమంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్ వంటి క్రీడలను ఎంచుకుని తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
అందరిలా కాకుండా విభిన్నంగా ఉండాలనే..
పాఠశాలలో అప్పడు 8వ తరగతి చదువుతున్న మారియా తనీమ్ తన తండ్రి మహ్మద్ ఖదీర్తో చర్చించి రైఫిల్ షూటింగ్ క్రీడను ఎంచుకున్నది. బొమ్మ తుపాకీ చూడటమే తప్పా క్రీడపై ఎలాంటి అవగాహన లేదు.మైనార్టీ గురుకుల పాఠశాలల సెక్రటరీ షఫియుల్లా, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ఖాసీం, స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్కుమార్ల ప్రోత్సాహంతో రైఫిల్ షూటింగ్ను ఎంచుకున్నది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శిక్షణ
రైఫిల్ షూటింగ్ కోచ్ సందీప్ పర్యవేక్షణలో మారియా తనీమ్ మొదటిసారి రైఫిల్ను చేతబట్టింది. 10మీటర్లు పేపర్ టార్గెట్పై గురిపెట్టి, నిరంతర కఠోర శ్రమతో రోజు రోజుకు తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ నెలరోజుల్లో క్రీడలో పట్టు సాధించి తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ నిర్వహించిన ఓపెన్ సైట్ 10మీటర్ల రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి అందరినీ ఆశ్చర్యం పరిచి అందరి మన్ననలను పొందింది.
కుమార్తె ప్రతిభను గుర్తించిన తండ్రి
తక్కువ సమయంలోనే అసమాన ప్రతిభ కనబర్చటంతో తండ్రి మహ్మద్ ఖదీర్ తనశక్తి మించినప్పటికీ సొంతఖర్చులతో జర్మన్లో తయారైన వాల్దేర్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ను కొనుగోలు చేసి కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడు. ప్రతి రోజూ శిక్షణ కోసం సైదాబాద్ నుంచి గచ్చిబౌలికి తీసుకెళ్లి నాలుగు గంటల పాటు శిక్షణ ఇప్పించేవాడు.
జాతీయ షూటింగ్లో సత్తా చాటుతా
జాతీయ క్రీడాకారుల ఎంపిక ట్రయల్స్లో పాల్గొనే అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. కోచ్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రభుత్వం సహకారం అందిస్తే జాతీయ జట్టుకు ఎంపికై సత్తాను నిరూపించాలని ఉంది. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్లో పాల్గొని దేశం తరుఫున సత్తాను ప్రదర్శించాలని ఉంది.
శిక్షణకు తప్పని కరోనా కష్టాలు..
కరోనా కారణంగా క్రీడా ప్రాంగణాలు మూసివేయడడంతో ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ సీఈవో మన్సూర్ కలీం సహకారంతో ఇంట్లోనే ఎలక్ట్రానిక్ టార్గెట్ మిషన్ ఏర్పాటు చేయించుకుని, ఆన్లైన్లో కోచ్ సుందర్ ఘాట్ సహాయంతో రోజుకు ఆరు గంటలపాటు శిక్షణ పొందింది. 2022 జనవరిలో మధ్యప్రదేశ్ భోపాల్లో నిర్వహించిన జాతీయ క్రీడాకారుల ఎంపిక ట్రయల్స్లో పాల్గొనే అర్హత సాధించింది. ఆరు విభాగాల్లో అసమాన ప్రతిభ కనబర్చిన భారత జట్టుకు ఎంపికైన మారియాకు ప్రభుత్వం, దాతలు, సంస్థల నుంచి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తే ఒలింపిక్స్పై గురి పెట్టి తెలంగాణ సత్తాను చాటుతానని చెబుతున్నది.
ఒలింపిక్స్లో చూడాలని ఉంది
మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన 64వ జాతీయ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్, యూత్ ఉమెన్, జూనియర్ ఉమెన్ విభాగాల్లో అద్భుతమైన స్కోర్ సాధించి టీమ్ సెలక్షన్ ట్రయల్స్కు అర్హత సాధించిన మారియా తనీమ్ను క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. మూడు విభాగాల్లో అసమాన ప్రతిభ కనబర్చిన మరియా ఒలింపిక్స్లో పాల్గొని సత్తాను చాటాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం పరంగా అన్ని రకాల ప్రోత్సాన్ని అందిస్తానని తెలిపారు.
మారియా సాధించిన పతకాలు