మలక్పేట, ఫిబ్రవరి 3 : మలక్పేట మహబూబ్ మ్యాన్షన్లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్కు గురువారం ఎర్ర బంగారం(ఎండు మిర్చి) పోటెత్తింది. రికార్డు స్థాయిల్లో ధర పలికింది. గురువారం 7526 బస్తాల (3010 క్వింటాళ్లు) మిర్చి మార్కెట్కు రాగా, గ్రేడ్-1 రకం మిర్చి 1204 క్వింటాళ్లు, గ్రేడ్-2 రకం మిర్చి 1806 క్వింటాళ్లు మార్కెట్కు వచ్చింది. సరుకు పోటెత్తిన విధంగానే ధరలు కూడా రికార్డు స్థాయిలో పలికాయి. అత్యధికంగా బ్యాడ్గీ రకం మిర్చి క్వింటాలకు రూ.20 వేలు ధర పలికిందని మలక్పేట మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, మార్కెట్ ఉప సంచాలకులు దామోదర్ తెలిపారు.
ప్రస్తుతం సీజన్ ఊపందుకుందని, రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాలనుంచి కూడా మిర్చి వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉల్లిగడ్డ కూడా 30879 బస్తాలు(15440 క్వింటాళ్లు) మార్కెట్కు వచ్చిందని, ధర మేలు రకం ఉల్లిగడ్డ క్వింటాలుకు రూ.2400, మధ్యరకం రూ.1800, నాసిరకం రూ.500 పలికిందన్నారు.