పీఆర్టీయూ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రిని ఆ సమావేశాలకు ఆహ్వానించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం ఫలించి ఆయనను కలవడానికి నేను సంఘ ప్రధాన కార్యదర్శి కమలాకర్రావుతో కలిసి వెళ్లాను. యాదృచ్ఛికంగా అదే సమయంలో టీఎన్జీవో, టీజీవో నాయకులు పీఆర్సీ అమలు కోసం ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. సందర్భం కాకపోయినా సార్తో మాట్లాడుతున్న సమయంలో కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు కూడా చర్చకు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటాల, త్యాగాల అనంతరం మనం సాధించుకున్న రాష్ట్రం. సాధించుకున్న రాష్ట్రంలో స్వయంపాలన, ఆత్మగౌరవం ఒక నినాదమైతే.. రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ అధిగమించి రాష్ర్టాన్ని పురోగమనం వైపు నడిపించడం ఒక బృహత్తర బాధ్యత. అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరంటు విషయంలో తీవ్ర సమస్యలు తప్పవని వ్యాఖ్యానించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 8 గంటల కరంటుకే గొప్పలు చెప్పుకొనేవారు. కానీ అలాంటివారు ప్రత్యేక రాష్ట్రం సాధించిన ‘విద్యుత్తు వెలుగులను’ చూసి నివ్వెరపోయారు. ఈ పరిస్థితి వెనుక కేసీఆర్ కృషి అనిర్వచనీయం. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కొక్క డిపార్టుమెంటులో ఆంధ్ర అధికారుల వల్ల జరుగుతున్న అన్యాయాలను స్వయంగా ప్రశ్నించిన సందర్భాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గుర్తుకు తెచ్చుకోవడం ఆయన సమగ్ర అవగాహనకు తార్కాణం. రాష్ట్ర భౌగోళిక స్వరూపం, రోడ్డు మార్గాలు, నీటి లభ్యత తదితరాలపై ఆయనకున్న విషయ పరిజ్ఞానం ఆశ్చర్యపరుస్తుంది. దానివల్లనే ఆయన అన్ని సమస్యల మూలాలను పరిశీలించి, వాటికి సరయిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తారని అర్థమవుతుంది.
మన సంప్రదాయంలో తొలిసూరు కాన్పు పుట్టింటివారే చేయాలన్న ఆచారం ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని వారికి ఇది కష్టం కలిగించే పరిస్థితి అని, అలాంటివారిని ఆదుకోవాలనే రాష్ట్రంలో ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన పలు అంశాల గురించి విపులంగా మాట్లాడుతుంటే ఇంతలోతుగా ఆలోచించే ముఖ్యమంత్రి ఉంటారా అనిపించింది. చెరువుల మరమ్మతు, ఇతర పనుల గురించి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం గురించి ఆయన సహేతుకంగా వివరించారు. అవన్నీ వింటున్నప్పుడు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కాకున్నా ఒక సగటు తెలంగాణ పౌరునిగా ఉద్విగ్నానికి లోనయ్యాను. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయానికి వచ్చినప్పుడు మొదలుపెడుతూనే ఆంధ్రా ఉద్యోగుల ముందు మిమ్మల్ని ఎంతమాత్రం తక్కువ చేయను. వారికన్నా అధికంగానే పీఆర్సీ ఉంటుంది అనగానే ఒక్కసారిగా అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని భావించినా- సార్ ఈ నెల నుంచే ఇస్తే బాగుంటుంది సార్ అని నేను ఒక్కమాట అనగానే వెంటనే మార్చి నుంచి అమలుచేద్దామని అంగీకరించడం ఆయన దయార్ద్ర హృదయానికి దర్పణం.
విద్యారంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలపాలన్న తపన ముఖ్యమంత్రి కేసీఆర్లో కనిపించింది. అంగన్వాడీ నిర్వహణ దగ్గరి నుంచి, ఇంగ్లీషు మీడియం నిర్వహణలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని సార్ భావిస్తున్నారు. ఇందుకు ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ప్రమాణాలలో శిక్షణ ఇవ్వాలని చెప్పిన సందర్భంలో నేను నా సంఘపక్షాన పూర్తిగా కలిసి నడుస్తామని తెలిపాను. శిక్షణ కార్యక్రమాలకు సంఘ భాగస్వామ్యాన్ని తెలియజేశాను. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేడర్ స్ట్రెంత్ దగ్గరినుంచి పదోన్నతుల వరకు అన్నింటిపై స్పష్టమైన అవగాహన ఉండటం కేసీఆర్ ప్రత్యేకత అనిపించింది. ఇచ్చిన మాట ప్రకారం 10479, పండిట్, పీఈటీలను ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయాలనే తపన కనిపించింది. ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని కోరగానే వెంటనే ఒప్పుకొన్నారు. ఇంకా పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని కోరినప్పుడు ఆ పదం వాడకూడదని మరొక పేరుతో వారిని నియమిద్దామని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం విషయమై పూర్తి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అందరు ఉద్యోగుల కోసం ఒక మంచి నూతన హెల్త్ స్కీం రూపొందించి వర్తింపజేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఏ సమస్య విషయంలోనైనా పరిష్కారం లభించేవిధంగా పూర్తి భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రిలో ఉద్యమ నాయకుడు అలాగే ఉన్నాడనే పూర్తి విశ్వాసం కలిగింది. రాష్ర్టానికి ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా అదృష్టం. రాష్ర్టాన్ని సాధించుకున్నాం.. దీన్ని నిలబెట్టే నాయకుడు కేవలం కేసీఆర్ మాత్రమేనన్న నమ్మకం కలిగింది. అందుకే ఆ కలలు సాకారమయ్యే విధంగా కలిసి నడువాలని నిర్ణయానికి వచ్చాను.
(వ్యాసకర్త:పింగిళి శ్రీపాల్రెడ్డి, టీఎస్ పీఆర్టీయూ అధ్యక్షుడు)