వ్యాధి నిరోధక టీకాను ‘వ్యాక్సిన్’ అంటారు. వీటిని నోటి ద్వారా కానీ, ఇంజెక్షన్ ద్వారా కానీ ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చిన కొంతకాలానికి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ఇక సాధారణంగా వ్యాధి లక్షణాలు కనిపించవు. టీకాలను బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కానీ, బ్యాక్టీరియాలు స్రవించే ‘టాక్సిన్’ నుంచి కానీ తయారుచేస్తారు. టీకాలతో నివారించగల వ్యాధుల్లో దాదాపుగా అన్నీ ఒకరినుంచి మరొకరికి వ్యాపించేవే. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించి అంటువ్యాధుల నుంచి రక్షించుకోలేకపోతే రాబోయే తరానికి ద్రోహం చేసినవాళ్లం అవుతాం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 1980లలో కేవలం ఐదు శాతం పిల్లలకే టీకాలు వేయించేవారు. ప్రస్తుతం దాదాపు 80 శాతం చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వంద సంవత్సరాల క్రితం మన అనారోగ్యానికి, మరణానికి ప్రధాన కారణం అంటువ్యాధులే. మశూచి (స్మాల్పాక్స్), డిఫ్తీరియా, కలరా లాంటి రోగాల వల్ల గ్రామాలు, చిన్నచిన్న పట్టణాలు ఊడ్చిపెట్టుకొని పోయేవి. గత 50 సంవత్సరాల నుంచీ వైద్యరంగంలో వచ్చిన పురోగతి వల్ల టీకాలను కనుక్కోగలిగాం. అంటువ్యాధులను అరికట్టగలిగాం.
అప్రమత్తత అవసరం
రక్షిత మంచినీటి సరఫరా తరువాత, ప్రజలను అనారోగ్యం నుంచి రక్షించే ప్రధాన మార్గాలలో టీకాలు ముఖ్యమైనవి. వ్యక్తిగత పరిశుభ్రత, జీవన పరిస్థితులు మెరుగుపడటం వల్ల అంటువ్యాధులు తగ్గినా, ఏ క్షణంలో అయినా తిరిగి వ్యాపించే ప్రమాదం ఉంది. కొన్ని వ్యాధులను కేవలం టీకాలతోనే నిర్మూలించగలం. అలాంటివాటిలో మెదడు, ఊపిరితిత్తులకు వచ్చే హిబ్ వ్యాధి ఒకటి. కొన్ని టీకాలు వేయించడం ఖరీదైన వ్యవహారంగా అనిపించినా, ఆయా వ్యాధులు వచ్చినప్పుడు వైద్యానికి చేసే ఖర్చు టీకాల వ్యయంతో పోలిస్తే ఎంతో ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాల లెక్కల ప్రకారం, టీకాల కోసం ఖర్చు చేసే ఒక డాలరుతో, వైద్యం కోసం చేయాల్సి వచ్చే 7 డాలర్లను ఆదా చేయవచ్చు. సంపన్న దేశాలతో పోలిస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో టీకాల కొరత కారణంగా శిశువులు మరణించే అవకాశం 10 రెట్లు ఎక్కువ. ఈమధ్య టీకాల గురించి నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నారు కొందరు. ఈ అభిప్రాయాలు శాస్త్రీయ విశ్లేషణకు నిలువలేవు. ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకొని, సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం టీకాలు వేయించడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎనిమిది లక్షలమంది పిల్లలు మృత్యుముఖం నుంచి బయటపడుతున్నారు. ఇంకా మరిన్ని లక్షల మంది పిల్లలను రక్షించడానికి వీలున్నది. ప్రతి వంద మంది శిశువులలో ముగ్గురు మీజిల్స్తో, ఇద్దరు కోరింతదగ్గుతో, ఒకరు ధనుర్వాతంతో మరణిస్తున్నారు. రెండు వందల మందిలో ఒకరు పోలియో వల్ల అంగవైకల్యం పాలవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది పిల్లలకు టీకాలు ఇప్పిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి , పిల్లల వైద్య నిపుణులు