Brain Stroke | స్ట్రోక్ బారిన పడుతున్న వారిలో యువత సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గతంలో కేవలం వృద్ధుల సమస్యగా భావించే బ్రెయిన్ స్ట్రోక్.. ఇప్పుడు యువతనూ వెంటాడుతున్నది. మొత్తం పక్షవాత కేసుల్లో సుమారు 14 శాతం మంది 18-44 ఏళ్ల మధ్య వయసు గలవారే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. పలు ఆసుపత్రులలోని 34,000కు పైగా కేసులను పరిశీలించిన అధ్యయనకారులు.. పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యను బయటపెట్టారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనదేశంలో చిన్న వయసులోనే పక్షవాతాలు సంభవిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు.
భారత్లో స్ట్రోక్ ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరణానికి నాలుగో ప్రధాన కారణంగా, అంగవైకల్యానికి ఐదో ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పని చేయడమే యువతలో స్ట్రోక్కు ప్రధాన కారణమని చెబుతున్నారు. అంతేకాకుండా, జంక్ ఫుడ్, అధిక ఉప్పు వినియోగం, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే రక్తపోటు పెరుగుతున్నది.
కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. పొగతాగడం, మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు గట్టిపడి, రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతున్నది. ఇవన్నీ కలిసి చిన్నవయసులోనే స్ట్రోక్ ముప్పును పెంచుతున్నాయని అధ్యయనకారులు వెల్లడిస్తున్నారు. పని ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటి మార్పులతో ఈ ప్రమాదం నుంచి బయట పడొచ్చని అంటున్నారు.