Health News | ఒక్కోసారి హడావుడిగా, ఏదో ఆలోచనలో ఉండి బ్రష్ చేసుకోలేదనే విషయం మరిచిపోయి స్నానం చేసేస్తుంటాం. తర్వాత గుర్తొచ్చి అప్పుడు బ్రష్ చేసుకుంటాం. ఇది ఎప్పుడో పొరపాటున ఒకసారి జరిగితే పర్వాలేదు. కానీ, అదే అలవాటుగా మారితే మాత్రం చర్మానికి నష్టమేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మనం పళ్లు తోముకున్నప్పుడు బ్యాక్టీరియా నోటి నుంచి చర్మం మీదకు చేరే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల నోటి చుట్టూ, గడ్డం చుట్టూ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అది నెమ్మదిగా మొటిమలకు కారణమవుతుంది. బ్రష్ చేసే సమయంలో చర్మం మీదికి బదిలీ అయిన బ్యాక్టీరియా వల్ల చర్మం మీద పగుళ్లు కూడా ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్నానానికి ముందే బ్రష్ చేసుకోవడం సురక్షితం. ఒకవేళ స్నానం తర్వాత బ్రష్ చేయాల్సి వస్తే ముఖాన్ని మరోసారి సబ్బుతో లేదా ఫేస్వాష్తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.