World Kidney Day | మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శరీరం ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి మూత్రపిండాలు దోహదపడతాయి. ఇవి రోజుకు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వాటి పనితీరు ఆధారంగా మిగతా శరీర భాగాలు సమతుల్యం చెంది సమర్థవంతంగా పనిచేసి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుత కాలంలో అత్యాధునిక వైద్య పద్ధతులు ఎన్ని వచ్చినా ఆందోళన కలిగించే అసంక్రామ్యత దీర్ఘకాల వ్యాధుల జాబితాలో కిడ్నీ సమస్య ఒకటి ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోంది. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా.. ప్రధానంగా జీవన విధానంలో మార్పులు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, హై బీపీ, షుగర్, గాలి, నీటి కాలుష్యం ప్రధానమైనవి. అదేవిధంగా శరీరంలో వేరే అవయవాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కూడా ఆ ప్రభావం కిడ్నీ మీద పడి కిడ్నీ వైఫల్యానికి కూడా దారితీస్తుంది.
దేశంలో ఏటా రెండు లక్షల మంది కొత్తగా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నట్లు అంచనా. మన దేశంలో 10 కోట్ల మంది కిడ్నీ బాధితులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ఏటా దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో 2.4 మిలియన్ల మంది చనిపోతున్నట్టు అంచనా. ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ వ్యాధిగ్రస్థులుగా ఉన్నారు. రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు (క్రానిక్ కిడ్నీ డిసీజ్) వేధిస్తున్న నేపథ్యంలో 2040 నాటికి ప్రపంచ మరణాలలో ఐదో స్థానాన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులే ఆక్రమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మన దేశంలో ప్రత్యేకించి… గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టమైన కారణమేది లేకుండా కిడ్నీలు దెబ్బతినడం చూస్తున్నాం. పర్యావరణంలోని విషతుల్యాలు, భార లోహాల ప్రభావం, ఒంట్లో నీటి శాతం తగ్గటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అలాగే గాలి కాలుష్యం ప్రమాదకరంగా పరిణమిస్తోంది. గాలి కాలుష్యానికి దీర్ఘకాల కిడ్నీ జబ్బులకు సంబంధం ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక వేడి మూలంగానూ, ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఇటీవల సైలెంట్ కిల్లర్గా కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల అంతర్జాతీయంగా వైద్య విభాగం అప్రమత్తమై “అందరికీ కిడ్నీహెల్త్” పేరిట ప్రజల్లో అవగాహనకు నడుం బిగించింది. పలు నెఫ్రాలజీ సొసైటీలు “వరల్డ్ కిడ్నీ డే’’ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ డే గా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధులను ఎలా నిర్ధారించాలి? వాటి లక్షణాలు ఏంటి? ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను హైదరాబాద్ కొంపల్లిలోని రెనోవా హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అర్చన దఫ్తార్దార్ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా 11 శాతం, మన దేశంలో 16 శాతం ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీ వైఫల్యం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి, రెండు దశల్లో ఉన్నప్పుడు రక్తం, మూత్ర పరీక్షలు చేస్తే తప్ప లక్షణాలు కనిపించవు. డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు, గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, వారసత్వంగా సమస్య ఉన్నవారు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని గుర్తించవచ్చు. మూడో దశలో కాళ్లు వాపు, రక్తహీనత, రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువమంది ఈ దశ వచ్చేవరకు సమస్యను గుర్తించలేరు. ఈ దశలో నిర్లక్ష్యం చేసినా, గుర్తించకపోయినా నాలుగో దశలో పరిస్థితి తీవ్రమై కిడ్నీ పనితీరు ఆగిపోయి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగా మారుతుంది. ఆకలి మందగించడం, ఆయాసం, వాంతులు, ఒంట్లో నీరు చేరడం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశలో డయాలసిస్ చేయాలి లేదా కిడ్నీ మార్చాలి, లేదంటే సమస్య తీవ్రమై రోగి మరణించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల లక్షణాలను తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.
కిడ్నీ వ్యాధి నిర్ధారణ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మూత్ర పరీక్ష, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ (జిఎఫ్ఆర్), రక్త పరీక్ష (సీరం క్రియాటినిన్) ద్వారా కిడ్నీ వ్యాధిని గుర్తించవచ్చు. కిడ్నీ వ్యాధుల్లోనూ పలు రకాలు ఉన్నాయి. అన్ని కిడ్నీ వ్యాధులకు డయాలసిస్ అవసరం ఉండదు. రోగులు కూడా ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే, ఆహార మార్పులు, మందులు, జీవనశైలి మార్పులతో వ్యాధిని నివారించవచ్చు. వ్యాధి తీవ్రమైతే డయాలసిస్ అవసరం రావచ్చు. ఈ వ్యాధి జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున నెఫ్రాలజిస్ట్ సూచనల ప్రకారం ఆహార అలవాట్లను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.
* మధుమేహం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
* మూత్రనాళ ఇన్ఫెక్షన్ లను, మూత్ర వ్యవస్థలో సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి
* తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సమతుల ఆహరం తీసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సరిపడా విశ్రాంతి తీసుకోవాలి
* మద్యం, ధూమపానం అలవాట్లను మానుకోవాలి
* మానసిక ఒత్తిడిని దగ్గించుకోవాలి
కిడ్నీ పనితీరు పది శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు రోగికి డయాలసిస్ అవసరం అవుతుంది. హఠాత్తుగా మూత్రం ఆగిపోయినప్పుడు, ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆయాసం అనిపిస్తుంది. శరీరంలో యాసిడ్స్, పొటాషియం పెరిగినప్పుడు కిడ్నీ పనితీరుతో సంబంధం లేకుండా రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి డయాలసిస్ మొదలైతే… జీవితాంతం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. తాత్కాలిక రుగ్మతలైతే… సమస్య పరిష్కారం అయ్యేంత వరకు డయాలసిస్ చేస్తే సరిపోతుంది. కిడ్నీ పనితీరు మెరుగైన తరువాత డయాలసిస్ నిలిపేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల్లో జీవితాంతం చేయాల్సి ఉంటుంది.
కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు ఇతరుల కిడ్నీని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది డయాలసిస్ నుంచి విముక్తి కలిగిస్తుంది. మరింత చురుగ్గా జీవించడానికి తోడ్పడుతుంది. అయితే కిడ్నీని శరీరం తిరస్కరించకుండా జీవితాంతం రోగనిరోధక శక్తిని అణచి పెట్టె మందులు వాడుకోవాల్సి ఉంటుంది.