Poppy Seeds | గసగసాలను మనం ఎంతో కాలం నుంచి వంట ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. చాలా వరకు మసాలా కూరల్లో గసగసాలను వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. గసగసాలనే పాపీ సీడ్స్ అంటారు. గసగసాలు సహజంగానే మత్తును కలిగించే పదార్థం. కనుక వీటిని చాలా మంది ఉపయోగించరు. అయితే వీటిని పండించాలంటే మాత్రం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గసగసాల శాస్త్రీయ నామం ఓపియం పోపీ. మత్తు మందు గుణాలు ఉంటాయి. కనుకనే కేవలం కొందరు మాత్రమే గసగసాలను పండిస్తారు. గసగసాలను పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. గసగసాల నుంచి తీసిన నూనెను కూడా వాడుతారు. దీన్ని కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కలుపుతారు.
గసగసాలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం గసగసాలు అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. 10 గ్రాముల గసగసాలను కొంచెం నీటితో కలిపి మెత్తగా నూరి అర కప్పు పాలలో కలిపి అందులో 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. దీంతో పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం తయారవుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. గసగసాలు మన శరీరానికి చలువ చేస్తాయి. 10 గ్రాముల గసగసాలను తీసుకుని కొంచెం నీళ్లతో కలిపి నూరి తగినంత పటిక బెల్లం కలిపి రోజూ తినాలి. దీంతో శరీరంలో ఉండే వేడి తగ్గిపోతుంది. శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేసవిలో ఈ మిశ్రమం శరీరానికి చలువ చేస్తుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా సురక్షితంగా ఉండవచ్చు.
చుండ్రుతోపాటు ఇతర జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా గసగసాలు పనిచేస్తాయి. గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టాలి. అనంతరం వాటిని రుబ్బి మెత్తని పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక కుంకుడుకాయల రసంతో తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలలో ఉండే కురుపులు తగ్గిపోతాయి. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. తలలో ఉండే దురద, బ్యాక్టీరియా, ఫంగస్ నశిస్తాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. గసగసాలు 10 గ్రాములు, యాలకులు 10 గ్రాములు, సోంపు గింజలు 10 గ్రాములను తీసుకుని నీళ్లతో కలిపి మెత్తగా నూరాలి. అందులో 60 గ్రాముల ఆవు నెయ్యి కలిపి నీరు ఇగిరి నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద మరగబెట్టాలి. తరువాత దించి వడబోసి నిల్వ చేయాలి. దీన్ని రోజూ తలకు రాసుకోవాలి. ఇలా చేస్తుంటే తల దిమ్ముగా ఉండడం, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
నీళ్లు లేదా జిగల విరేచనాలు అవుతున్న వారు గసగసాలను వాడితే ఉపశమనం లభిస్తుంది. గసగసాలు 10 గ్రాములు, పటిక బెల్లం 20 గ్రాములు కలిపి మెత్తగా నూరి నిల్వ చేయాలి. దీన్ని పూటకు 5 గ్రాముల మోతాదులో తీసుకుని 20 గ్రాముల వెన్నలో కలిపి తింటుండాలి. ఇలా రోజుకు 2 లేదా 3 పూటలు తినాలి. దీంతో రక్తం లేదా నీళ్లు, జిగట విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణీలు కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. అన్నంలో పెరుగు కలిపి తింటే ఇంకా త్వరగా ఉపశమనం లభిస్తుంది. గసగసాలను దోరగా వేయించి దంచి చూర్ణం చేసి 2 పూటలా పూటకు 5గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదుగా అన్నంలో కలిపి తింటుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. విరేచనాల నుంచి కూడా బయట పడవచ్చు. రాత్రి పూట పాలలో కాస్త గసగసాల పొడి కలిపి తాగితే నిద్ర చక్కగా పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా వస్తుంది. గసగసాలను వేడి చేసి వస్త్రంలో చుట్టి వాసన పీలుస్తున్నా నిద్ర పడుతుంది. ఇలా గసగసాలతో అనేక చిట్కాలను పాటించవచ్చు.