న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, అయితే ఈ వేరియంట్ కోసం ప్రత్యేకంగా భిన్నమైన వ్యాక్సిన్ అవసరం ఉండబోదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ తేలికపాటి లక్షణాలను కలిగిఉంటుందా..అసలు దీని మూలాలపై నెలకొన్న సందేహాలు వంటి అంశాలు ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని అన్నారు. ఒమిక్రాన్ ప్రాబల్య వేరియంట్గా మారే అవకాశం ఉందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ఇన్ఫెక్షన్స్కు డెల్టా వేరియంట్ కారణమవుతోందని, కొద్దినెలల్లో డెల్టా కంటే ఒమిక్రాన్ ద్వారా అధిక ఇన్ఫెక్షన్లు సంక్రమిస్తాయని ఐరోపా యూనియన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని సౌమ్య స్వామినాధన్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో కేసులు రోజూ రెట్టింపవుతున్నాయని ఇది ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనేది వెల్లడిస్తోందని చెప్పారు. తాజా వేరియంట్ను ఎదుర్కొనేందుకు మనం భయాన్ని వీడి అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. పలు కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోవడం, స్వల్ప లక్షణాలు బయటపడుతున్న క్రమంలో ఈ దశలో ఒమిక్రాన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ నిర్ధిష్టంగా అంచనా వేయలేదని చెప్పుకొచ్చారు.
యాంటీబాడీలపై ఒమిక్రాన్ ప్రభావంపై కూడా మనం అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని అన్నారు. గతంలో ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా సమకూరిన సహజ రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్ కొంత అడ్డుకోగలుగుతున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. ఒమిక్రాన్ సోకినవారు తీవ్ర అనారోగ్యానికి గురికావడంలేదని అంటే వ్యాక్సిన్లు ఇప్పటికీ రక్షణ కల్పిస్తున్నాయని మనం ఆశించవచ్చని ఆమె పేర్కొన్నారు.