న్యూఢిల్లీ : పరిమిత మోతాదులో మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయానికి విరుద్ధంగా మద్యం కొద్ది మోతాదులో తీసుకున్నా అది క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్లో ప్రచురించిన ప్రకటనలో డబ్ల్యూహెచ్ఓ ఈ వివరాలను విస్పష్టంగా వెల్లడించింది. మద్యం వినియోగం విషయంలో ఒక గ్లాస్ వైన్ లేదా గ్లాస్ బీరు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండదని పేర్కొంది.
మద్యపానం పేగు, బ్రెస్ట్ క్యాన్సర్ సహా ఏడు రకాల క్యాన్సర్లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మద్యం వినియోగంలో సురక్షితమైన లెవెల్ అంటూ ఉండదని, మీరు ఎంత మోతాదులో మద్యం తాగుతున్నారనే దానితో పనిలేకుండా ఎలాంటి ఆల్కహాల్ డ్రింక్లో తొలి డ్రాప్ నుంచే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎంత ఎక్కువ తాగితే ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని మాత్రమే తాము చెప్పగలమని యూరప్లోని డబ్య్లూహెచ్ఓ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన డాక్టర్ కరిన ఫెరెరియ-బోర్జెస్ వెల్లడించారు.
లాన్సెట్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం యూరప్లో మద్యం తీసుకోవడం ద్వారా వచ్చిన క్యాన్సర్లలో సగం కేసుల్లో రోగులు కొద్ది మోతాదులో ఓ మాదిరిగా ఆల్కహాల్ తీసుకునేవారేనని వెల్లడైంది. వీరిలో చాలామంది వారానికి 1.5 లీటర్ల వైన్, 3.5 లీటర్ల కన్నా తక్కువగా బీర్ తీసుకునేవారని రిపోర్ట్ పేర్కొంది. మద్యం సేవించిన సమయంలో అది శరీరంలోని కార్సినోజెన్తో కలిసి డీఎన్ఏను దెబ్బతీస్తుందని, డీఎన్ఏను శరీరం రిపేర్ చేసే సామర్ధ్యాన్ని నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డీఎన్ఏ ధ్వంసమైతే కణాలు అదుపుతప్పడంతో క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడుతుందని తెలిపారు.