న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రియసస్ హెచ్చరించారు. ఒక్కో దేశం ఒక్కో రకమైన సవాళ్లను, సంక్లిష్ట పరిస్ధితిని ఎదుర్కొంటోందని అన్నారు. పలు దేశాల్లో టెస్టింగ్ ఆశించిన రీతిలో జరగకపోవడం వల్లే గత కొద్దివారాలుగా కేసులు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దక్షిణకొరియాలో గురువారం ఏకంగా 6.2 లక్షల తాజా కేసులు వెలుగుచూశాయి. జర్మనీ, వియత్నాం, ఫ్రాన్స్, బ్రిటన్ , చైనాలోనూ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటం కలకలం రేపుతోంది. మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందనే ఆందోళనల నడుమ భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు. మరోవైపు దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,281 మంది మృతిచెందగా, 29,181 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 149 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.