‘వందల కిలోమీటర్లు ప్రయాణించి రోగి వైద్యుడి దగ్గరికి రావడం ఏమిటి? వైద్యులే రోగి దగ్గరికి వెళ్లాలి. అదే న్యాయం. అదే ధర్మం. ఎంతమంది పేదవాళ్లకు వైద్యం చేస్తే అంత మనసున్న డాక్టర్ అయినట్టు. నీ దగ్గరికి రావడానికి పేదలు జంకుతున్నారంటే.. వైద్యుడిగా నువ్వు చనిపోయినట్టే’ అంటారు డాక్టర్ దేవయాని. ఆమె చేతిలోని స్టెతస్కోప్ రోగి నాడినే కాదు, పేదరికపు బాధల్నీ వినగలదు. కాబట్టే, నగరాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్లిందా డాక్టరమ్మ. ఆ తొమ్మిది పదుల జీవితసారమంతా ఆమె మాటల్లోనే..
మా నాన్న ఇంజినీర్. సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేశారు. నేను మెడిసిన్ చదవాలని ఆయన కోరిక. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత ఆరోగ్యశాఖలో ఉద్యోగం వచ్చింది. గాంధీ, నిలోఫర్, నిమ్స్, టీబీ
దవాఖానల్లో పనిచేశాను. తర్వాత, డిప్యుటేషన్ మీద దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు పంపారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే పెద్ద చదువుల కోసం లండన్ వెళ్లాను. తిరిగొచ్చాక నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఒక్కదాన్నీ అంతదూరం ఉండలేనని నాన్న వద్దన్నారు. తను కట్టించిన ఓ పెద్ద భవనంలోనే ఒక అంతస్తు నాకు ఇచ్చారు. అక్కడే హాస్పిటల్ పెట్టమన్నారు. సమయానికి చేతిలో డబ్బుల్లేవు. ఏం చేయాలో తోచలేదు. ఇంట్లోని మంచాలు, కుర్చీలు, టేబుళ్లతో ముషీరాబాద్లో డంగోరియా మెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభించాను. మొదట్లో వార్డు మొత్తం ఖాళీగా ఉండేది. రోజుకు నాలుగైదు మంది పేషెంట్లు వచ్చేవారు. డెలివరీ చేస్తే వంద రూపాయల కంటే ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. ఏడాది తిరిగే సరికి జనమే జనం. రెండో సంవత్సరం ఇంకో అంతస్తు కూడా వాడుకున్నాను. డాక్టర్లు, స్టాఫ్ సంఖ్య పెంచాను. మెదక్లోని క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో ఇద్దరు విదేశీ డాక్టర్లు పనిచేసేవారు. కానీ ఒక్క గైనకాలజిస్ట్ కూడా ఉండేవారు కాదు. దీంతో నన్ను పిలిచారు. వారానికి ఒక రోజు మెదక్ వెళ్లి ఉచితంగా వైద్యం అందించేదాన్ని. అలా పదేండ్ల పాటు సేవలు చేశాను. ఎంతోమంది నిరుపేదలకు వైద్యం చేశాను. అదో సంతృప్తి కరమైన అనుభవం.
సర్కారు దవాఖానలో చేస్తున్నప్పటి నుంచీ నాకు పేదల కష్టాలు తెలుసు. సమస్య ముదిరిపోయాకే వాళ్లు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఎంత చేయి తిరిగిన వైద్యులైనా ఏమీ చేయలేని పరిస్థితి అది. దానికి రకరకాల కారణాలు. ఆడవాళ్లు ఏదైనా సమస్య ఉంటే మగవాళ్లకు చెప్పుకోలేరు. పల్లెల నుంచి నగరాలకు వచ్చి వైద్యం చేయించుకోలేరు. అందులోనూ అడవి దాటి, హైదరాబాద్ రావడం అంటే.. ఇప్పుడు విదేశాల్లో వైద్యం చేయించుకోవడంతో సమానం. కాబట్టి, డాక్టర్లే వాళ్ల దగ్గరికి వెళ్లాలి. రోగులు ఇలా ఇంతదూరం ప్రయాణించాల్సిన అవసరం రావడం అన్యాయం. దవాఖానలకు దూరంగా బతుకుతున్న ప్రజలకే నా అవసరం ఎక్కువ ఉంది అనిపించింది. అందుకే మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ఆరెకరాల భూమి కొని.. ఓపీ వార్డు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ నిర్మించాను. 1979లో నాన్న స్వయంగా హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించారు. నా నిర్ణయానికి ఎంతో సంతోషించారు.
గ్రామాల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోరు. రోగం ముదిరాకే డాక్టర్ దగ్గరికి వస్తారు. కొన్నిసార్లు అసలు హాస్పిటల్కు రాకపోవచ్చు కూడా. నర్సా పూర్లో ప్రతి శుక్రవారం సంత జరిగేది. అక్కడికి వచ్చిన వాళ్లు తప్పకుండా దవాఖానకు వస్తారనే ఉద్దేశంతో నేను కూడా వెళ్లేదాన్ని. మొదట్లో అక్కడే ఒక నర్సు ఉండేది. తర్వాత డాక్టరును ఏర్పాటు చేశాం. నర్సాపూర్ హాస్పిటల్లో ఉచితంగా పని చేయడానికి కొంతమంది డాక్టర్లు ముందుకొచ్చారు. ప్రతి శుక్ర, మంగళవారాలు నాతోపాటు వచ్చేవాళ్లు. హైదరాబాద్ దాటిన తర్వాత రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండేది. నానాతిప్పలు పడుతూ జీప్లో ప్రయాణించే వాళ్లం. అక్కడ తినడానికి ఏమీ దొరికేది కాదు. ఇంటి నుంచే తీసుకుపోయేవాళ్లం. అయిదు రూపాయల ఫీజుతో వైద్యం మొదలుపెట్టాం. సిజేరియన్కి వంద తీసుకునేవాళ్లం. పేదల కోసం పనిచేయాలనుకునే డాక్టర్ల బృందం సహకారంతో మాడల్ హాస్పిటల్ను నలభై ఏండ్లపాటు నడిపాం.
పేదలకు వైద్యమే కాదు ఆరోగ్యం కూడా అవసరమే. డంగోరియా చారిటబుల్ ట్రస్ట్ తరఫున పోషకాహారం తయారీ యూనిట్ పెట్టాం. నర్సాపూర్ హాస్పిటల్లో నెలకు ఎనభై దాకా డెలివరీలు జరిగేవి. రోజుకు రెండు వందల మందికి ఓపీ సేవలు అందించేవాళ్లం. హాస్పిటల్కు వచ్చినవాళ్లకు మంచి ఆహారం అందుబాటులోకి తెచ్చాం. దాన్నే సీసీఎంబీ, ఫెర్నాండెజ్ హాస్పిటల్ కూడా కొనుగోలు చేస్తున్నాయి. హైదరాబాద్లో చాలా దవాఖానాల్లో లక్ష రూపాయలకు తక్కువ కాకుండా డెలివరీ బిల్ ఉండట్లేదు. అంత ఖర్చు ఎందుకవుతుంది? అందరూ పనిచేసేది సైంటిఫిక్గానే కదా! మేం ఇప్పటికీ పది నుంచి పదిహేను వేలకే డెలివరీ చేస్తున్నాం. జనంలో డాక్టర్ మీద నమ్మకం, గౌరవం పెరగాలంటే వైద్యరంగం వ్యాపార దృక్పథాన్ని వీడాలి. ఇప్పటికీ నేను హాస్పిటల్కు వెళ్తాను. ఓపీలో కూర్చుంటాను. మిగతా సమయంలో ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటాను.
హైదరాబాద్లోని ఒక ఆశ్రమంలో వారానికి ఒకరోజు ఉచితంగా వైద్యం చేస్తాన్నేను. ఎప్పటిలాగే ఒకరోజు అక్కడికి వెళ్లాను. మూడొందల రూపాయల ఫీజు కట్టలేదనే కారణంతో ఒకమ్మాయి సామాన్లు బయటపడేశారు. ఆమె తండ్రి వాళ్లను బతిమాలుతున్నాడు. ఆ అమ్మాయి బుద్ధిమాంద్యురాలు. వదిన వెళ్లగొట్టింది. తండ్రికి డబ్బు కట్టేంత స్తోమత లేదు. నేను చొరవ తీసుకుని.. నర్సాపూర్ రమ్మన్నాను. హాస్పిటల్లో డాక్టర్ల కోసం కట్టిన కాటేజీలో ఆశ్రమం స్టార్ట్ చేశాను. అలా మొదలైన ఆశ్రమంలో వృద్ధులు, అనాథలకు ఆశ్రయం కల్పించాం.
నాగవర్ధన్ రాయల