Monkeypox | కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం నుంచి జనాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. గత రెండేండ్లలో కొవిడ్-19 సృష్టించిన కల్లోలాన్ని మరిచిపోయి మళ్లీ యథా జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మంకీ వైరస్ అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. తొలి కేసు బయటపడిన కొద్ది రోజుల్లోనే 12 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తరహాలోనే ఇది కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందా? ఏంటి? అని బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో అసలు ఏంటి మంకీపాక్స్? ఈ వైరస్ ఎలా వచ్చింది? ఇది సోకితే ఏమవుతుంది? వంటి వివరాలను ఒకసారి చూద్దాం..
ఇటీవల స్పెయిన్, బెల్జియంలో జరిగిన అసహజ లైంగిక రేవ్ పార్టీ కారణంగా ఈ మంకీపాక్స్ ప్రబలిందని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ డేవిడ్ హేమన్ అనుమానం వ్యక్తం చేశారు. మంకీ పాక్స్ వైరస్ ప్రబలడానికి కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనికా) వ్యాక్సిన్ వేసుకోవడం కారణమని కొందరు కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఇది తప్పుడు ప్రచారమని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు.
17వ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన మశూచి ( స్మాల్ పాక్స్) కుటుంబానికి చెందినదే ఈ మంకీ పాక్స్. ఈ వైరస్ను తొలిసారిగా 1958లో బయటపడింది. కోతులు ఎక్కువగా ఉండే కాలనీల్లో ఈ వైరస్ బయటపడటంతో దీన్ని మంకీ పాక్స్ అని పిలుస్తున్నారు. అయితే కోతుల్లో బయటపడిన ఈ వైరస్ ఆనవాళ్లను 1970ల్లో మనుషుల్లో తొలిసారి గుర్తించారు. మశూచి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఆఫ్రికాలోని కాంగోలో మొదటిసారిగా మంకీపాక్స్ కేసు గుర్తించారు. అప్పట్లో ఆఫ్రికా దేశాలైన లైబీరియా, నైజీరియా, సియారాలియోని వంటి దేశాల్లోనూ మంకీ పాక్స్ కేసులు గుర్తించారు.
తాజాగా ఇప్పుడు మరోసారి మంకీపాక్స్ కేసులు ఎక్కువవుతున్నాయి. తక్కువ వ్యవధిలోనే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లోకి ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కరోనావైరస్లా ఇది ప్రపంచ దేశాలకు విస్తరించకముందే దీని విషయంలో అప్రమత్తత పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్వో ) హెచ్చరిస్తుంది. దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్వో) అప్రమత్తం చేస్తూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. మంకీపాక్స్ లక్షణాలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అన్ని దవాఖానల్లో చికిత్సకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
జ్వరం, ఒళ్లు నొప్పులు, శోషరస గంథ్రుల్లో వాపు, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం.
మంకీ పాక్స్ సోకిన తర్వాత ప్రారంభ దశలో తీవ్ర జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత రెండు నుంచి నాలుగు రోజుల్లో ఒళ్లంతా దద్దుర్లు వస్తాయి. ఆ దద్దర్లు పెరిగి పుండ్లలా మారుతాయి. మొహం, వీపు ఇలా శరీరంలోని ఏ ప్రాంతంలో అయినా ఈ దద్దర్లు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలి. కంగారు పడిపోకుండా వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లిపోవాలి. మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన వారితో సన్నిహితంగా ఉన్నవారు కూడా ఐసోలేషన్లోకి వెళ్లడం మంచిది.
ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువుల ద్వారా మంకీపాక్స్ ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు కరిచినప్పుడు ఇది మనుషులకు సోకే అవకాశం ఉంది. ఒకసారి మనుషుల్లోకి వచ్చాక తుంపర్లు, కండ్లు, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అలాగే బాధితులు తాకిన వస్తువుల ద్వారా కూడా మంకీ పాక్స్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది.
మంకీపాక్స్కు నిర్దిష్టమైన మందులేమీ లేవు. అమ్మవారు (స్మాల్పాక్స్) సోకినప్పుడు చేసే చికిత్సనే మంకీపాక్స్కు అందిస్తున్నారు. స్మాల్పాక్స్ ఔషధాలు 85 శాతం ప్రభావాన్ని చూపుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే ఐసోలేషన్కు వెళ్లాలి. కరోనా వైరస్ తరహాలో ఆస్పత్రిలో చేరాలి.. ఐసోలేషన్లో ఉండాలని చెప్పగానే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇదే విషయాన్ని ఎన్సీడీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా వెల్లడించింది. లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపింది. అంటే చర్మంపై ఏర్పడిన పుండ్లు 14 రోజుల నుంచి 21 రోజుల పాటు పచ్చిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా ఆ పుండ్లు ఎండిపోతాయి. మరో వారం రోజుల్లో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. కానీ చర్మంపై మచ్చలు మాత్రం చాలా రోజులు ఉండిపోతాయి. అయితే అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుందని ఎన్సీడీసీ పేర్కొంది. మరణాల రేటు 1-10 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.