ఇప్పుడందరూ ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టిపెడుతున్నారు. చక్కెరను వీలైనంత దూరం పెడుతున్నారు. బదులుగా టీ, కాఫీ, ఇతర డ్రింక్స్లో ఆరోగ్యకరమైన స్వీట్నర్లను వాడుతున్నారు. మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే స్వీట్నర్ బెల్లం. స్వీట్లు, కొన్నిరకాల పచ్చళ్లలో కూడా బెల్లాన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో పొటాషియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ పాలతో బెల్లం కలిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
బెల్లం పాలతో ఆరోగ్యం దెబ్బతింటుందా?
మధుమేహులు చక్కెరలేని టీ తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వీరు టీలో బెల్లం కలుపుకుని తాగుతుంటారు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం, విరుద్ధ ఆహారం లేదా చెడు ఆహార కలయికలు పేలవమైన జీర్ణక్రియకు దారితీస్తాయి. జీర్ణక్రియ తర్వాత విషపూరిత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. బెల్లం-పాలు అలాంటి కలయికల్లో ఒకటని ఆయుర్వేదం చెబుతోంది. పాలు శరీరాన్ని చల్లబరిస్తే బెల్లం వేడిచేస్తుంది. ఇలా శీతల శక్తి కలిగిన పదార్థంతో వేడిచేసే పదార్థం తీసుకున్నప్పుడు జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, చక్కెరకు పటిక బెల్లం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది పాలలాంటి శీతలీకరణ శక్తి కలిగిన ఆహారం. దీనివల్ల జీర్ణక్రియకు ఎలాంటి ఆటంకం కలుగదు. ఇదిలా ఉండగా, పాలు-చేపలు, తేనె-నెయ్యి, పెరుగు-జున్ను, అరటిపండు- పాలు విరుద్ధ కలయిక ఆహారాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఇవి కడుపులో మంటను ప్రేరిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కూడా దారితీయొచ్చు.