న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలిలో కూర్చుని పనిచేయడం ఆరోగ్యానికి శాపంలా మారింది. కదలికలు లేని లైఫ్స్టైల్ అనేక వ్యాధులను తెచ్చిపెడుతోంది. కొవ్వుపేరుకుపోయి జీవక్రియల వేగం తగ్గి శరీరం వ్యాధులకు నిలయమవుతోంది. ఆరోగ్యకరమైన, వేగవంతమైన జీవక్రియలతో అధిక బరువుకు కళ్లెం వేయడంతో పాటు చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చక్కెరతో నిండిన పానీయాలతో శరీరానికి ఎలాంటి పోషకాలు అందకపోగా బరువు పెరుగుతారని వీటి స్దానంలో నీళ్లు ఎక్కువగా తాగాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మంచినీరు అధికంగా తీసుకోవడంతో జీవక్రియలు వేగం పుంజుకుంటాయి. వర్క్ ఫ్రం హోంతో ఎక్కువ మంది ఇప్పుడు కుర్చీలకు అతుక్కుపోతున్నారు. అధిక సమయం కూర్చోవడం పొగతాగడం కంటే ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తరచూ ఎక్కువసేపు నిల్చోవడం ద్వారా కేలరీలు కరుగుతాయని మెటబాలిజం మెరుగవుతుందని సూచిస్తున్నారు. ఇక బరువైన వస్తువులను ఎత్తడం అలవాటు చేసుకోవాలని కండలు రాటుదేలితే మెటబాలిజం వేగవంతమవుతుంది. ఇక మంచి ఆహారం, వ్యాయామం అలవరుచుకున్నా కంటి నిండా నిద్ర కరువైతే జీవక్రియల వేగం తగ్గడమే కాకుండా నిద్రలేమితో అధిక బరువు ఇతర అనారోగ్యాలు వేధిస్తాయి.