నాలుగుపదులు దాటినవారిలో మధుమేహం సాధారణం. కానీ ఇరవై, ముప్పై ఏండ్ల వారిలోనూ కనిపిస్తుండటం ఆందోళనకరం. మధుమేహాన్ని గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని అర్థంచేసుకోగలిగితే.. రోగం మరింత ముదిరి టైప్ 2 డయాబెటిస్కు దారితీయకుండా జాగ్రత్తపడవచ్చు.ప్రపంచవ్యాప్తంగా యువతలో మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, కదలికలు లేని జీవిత విధానం తదితరాలు దీనికి కారకాలు. 40 ఏండ్లు నిండకముందే మధుమేహం వచ్చిందంటే.. అది టైప్ 2 డయా బెటిస్కు నాందిగా పరిగణించాలి. గత దశాబ్దాలతో పోలిస్తే పిల్లలు, కౌమార దశలో ఉన్నవాళ్లు, 20-30 ఏండ్ల యువత కూడా మధుమేహం బారినపడుతుండటం ఆందోళనకర పరిణామం.
టైప్2 లక్షణాలే..
నడి వయసు దాటిన వారిలో కనిపించే టైప్ 2 డయాబెటిస్ లక్షణాలే యువతరంలో వచ్చే మధుమేహంలోనూ కనిపిస్తాయి. అధిక దాహం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన, అలసట, గాయాలు తొందరగా మానకపోవడం, పాదాల్లో తిమ్మిర్లు, మసకగా కనిపించడం.. చక్కెర వ్యాధికి తొలి సంకేతాలు.
నివారణ ఎలా?
జీవనశైలి మార్పుల ద్వారా మధుమేహాన్ని నివారించగలం. ప్రొటీన్లతో సమృద్ధమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులోనూ తక్కువ కార్బొహైడ్రేట్స్, తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఊబకాయులు శరీర బరువును తగ్గించుకోవాలి. వేళకు నిద్రించాలి. కనీసం 7 గంటలు నిద్రపోవాలి. బ్రిస్క్ వాకింగ్, ఇంటిపని, తోటపని దినచర్యలో చేర్చుకోవాలి. ఆటపాటల్లో నిమగ్నం కావాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఇక టైప్2 డయాబెటిస్ను తొలిదశలోనే నివారించాలంటే.. నాణ్యమైన జీవనశైలే ఏకైక మార్గం. ధూమపానం పూర్తిగా మానేయాలి.