Endometriosis | మేడమ్! నాకు రజస్వల అయినప్పటి నుంచీ నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తున్నది. మా ఊళ్లోని డాక్టర్ను సంప్రదిస్తే నొప్పి తగ్గే మాత్రలు ఇచ్చారు. ఎనిమిదేండ్ల నుంచీ అవే వాడుతున్నా. ఈ మధ్య కుడివైపు పొత్తి పొట్టలో బాగా నొప్పి అనిపిస్తున్నది. ఎండో మెట్రియాసిస్ కావచ్చని డాక్టర్ అన్నారు. నొప్పి మందులు వాడటం వల్లే ఈ సమస్య వచ్చిందంటారా?
ఓ పాఠకురాలు
మీరు వాడిన మాత్రలకు, ఎండోమెట్రియాసిస్కు ఎలాంటి సంబంధం లేదు. ఎండోమెట్రియాసిస్ జన్యుపరమైంది. వంశపారంపర్యంగా కానీ, పుట్టుకతో వచ్చే జన్యువుల్లో తేడాల వల్ల కానీ ఈ సమస్య రావచ్చు. ఈ రుగ్మతకు ఇదీ కారణమని స్పష్టంగా చెప్పలేం. అమ్మాయి రజస్వల అయినప్పటి నుంచి బిడ్డ పెరుగుదలకు అనుకూలంగా ప్రతి నెలా ఎండోమెట్రియం అనే ఒక పొర గర్భాశయ అంచుల దగ్గర ఏర్పడుతుంది. ఒక వేళ ఆ నెల అండం ఫలదీకరణం చెంది పిండం ఏర్పడకపోతే, ఆ పొర యోని గుండా బయటికి వచ్చేస్తుంది. అదే రుతుస్రావం.
ఈ పొర కొందరిలో అండాశయం మీద, ఫాలోపియన్ ట్యూబుల దగ్గర, కటి ప్రదేశం లోపల.. ఇలా ఏర్పడుతుంది. ఇది కూడా సాధారణ ఎండోమెట్రియం పొరలాగే హార్మోన్లలో మార్పులకు ప్రతిస్పందిస్తుంది. అలాగే స్రవిస్తుంది కూడా. కానీ అవి ఏర్పడ్డ ప్రదేశం దగ్గర స్రావాలు బయటికి వచ్చే అవకాశం ఉండదు కనుక, రక్తం గూడు కట్టుకుపోతుంది. దానివల్ల మీకు నొప్పి వస్తుంది. అయితే దీని పరిస్థితిని ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్లాంటి పరీక్షలు చేసి కనుక్కోవచ్చు. అవసరమైతే లాప్రోస్కోపీ చేస్తారు. కొందరిలో ఎండోమెట్రియాసిస్ వల్ల నిరంతరం నొప్పి ఉంటుంది, సంతాన లేమి ఏర్పడుతుంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు. ముందు మీ పరిస్థితిని బట్టి ప్రస్తుతానికి కొద్ది రోజులు డాక్టర్లు మాత్రలు ఇస్తారు. అవి వాడండి. తగ్గకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్