హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. కేసీఆర్ కిట్. 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతోపాటు, తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందిస్తున్నారు. తల్లులకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తున్నది. వారు ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా మరో 1000 రూపాయలు కలిపి 13 వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పటివరకు
13,90,636 మందికి కిట్లతోపాటు, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ పథకం కోసం ప్రభుత్వంరూ.1261 కోట్లను ఖర్చు చేసింది.