Health Tips | కాలేయం.. శరీరంలో అతి కీలకమైన అవయవం. ఇది అతిపెద్ద గ్రంథి. ఒక్క కాలేయమే దాదాపు అయిదొందల విధులు నిర్వర్తిస్తుంది. చర్మం తరువాత ఒక్క కాలేయానికే పునరుత్పత్తి సామర్థ్యంఉంది. దాదాపు డెబ్బయి అయిదు శాతం దెబ్బతిన్నా కూడా.. తక్కిన పావు భాగంతోనే కాలేయం తన విధులను నిర్వహించగలదు. అంతేకాదు, ఆరోగ్యకరమైన జీవనశైలితో శిథిలమైన భాగాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోగల అసాధారణ శక్తి కాలేయానికి ఉంది. మనిషి మరణించే వరకూ ఆ పునరుత్పాదక శక్తి కొనసాగుతుంది. అంటే కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి.. ఆ లోపాల్ని సరిదిద్దుకోవడానికి మనిషికి అవకాశం ఇస్తుందన్నమాట. అయితే కాలేయ కణాలు మొత్తం దెబ్బతిన్నప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా చేజారుతుంది. కాలేయానికి ఉన్న ప్రత్యేక శక్తి కూడా పనికి రాకుండా పోతుంది.
మద్యపాన వ్యసనం, హెపటైటిస్-బి, సి వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువమందికి కాలేయ వ్యాధులు దాపురిస్తున్నాయి. ఆ రుగ్మతకు సంకేతంగా మొదట కామెర్ల వ్యాధి సోకుతుంది. దాన్ని గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోవాలి. లేదంటే, అది కాస్త ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. వీటిలో హెపటైటిస్- ఎ, ఇ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు మరీ ప్రమాదకరం. హఠాత్తుగా మరణం ముంచుకొస్తుంది. కలుషితమైన నీళ్లు, ఆహారం నుంచి హెపటైటిస్-ఎ, ఇ వైరస్లు శరీరంలో ప్రవేశిస్తాయి. దీర్ఘకాలంపాటు మితిమీరిన మద్యపానం అలవాటు.. కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో, లివర్ సిరోసిస్ వ్యాధి వస్తుంది.
ఊబకాయం కూడా కాలేయ వ్యాధులకు కారణం అవుతున్నది. ఫ్యాట్ సిరోసిస్ లేదా నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ ఏర్పడుతుంది. ప్రస్తుతం కాలేయ సమస్యలతో వస్తున్న వారిలో దాదాపు సగం మందిలో ఈ ఫ్యాట్ సిరోసిస్ వ్యాధే కనిపిస్తున్నది. ఫ్యాట్ సిరోసిస్ బి, సి దశ ప్రారంభంలో కాలేయ కణాలు చాలావరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. ఇక పిల్లల్లో కనిపించే కాలేయ వ్యాధులు చాలావరకు పుట్టుకతో వస్తున్నవే. శరీరధర్మాలకు సంబంధించినవే. విల్సన్ డిసీజ్, బైల్ డక్ట్స్ లేకపోవటం, కురుపులు వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్న పిల్లల కాలేయం భవిష్యత్తులో పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.
కాలేయం దెబ్బతినటం ఓ ప్రమాద సంకేతం. ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్ సహా వివిధ కాలేయ వ్యాధులను ఔషధాలతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి చేజారిపోతుంది. కాలేయ వ్యాధులు సోకినా కూడా.. ఆ లక్షణాలు బయటపడటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో కాలేయ కణాలు క్రమంగా మృతిచెందుతూ వస్తాయి. దీంతో ‘లివర్ స్కార్’ ఏర్పడుతుంటుంది. ఇది కాలేయాన్ని పూర్తిగా కప్పేసేటప్పటికి రోగలక్షణాలు స్పష్టంగా బయటపడతాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. ఈ పరిస్థితికి చేరేలోగా కాలేయానికి కష్టాలు మొదలైపోతాయి. ఆ సంకేతాలూ కనిపిస్తాయి. కళ్లు పచ్చబడతాయి. దురద బాధపెడుతుంది. ఆకలి మందగిస్తుంది. నీరసంగా ఉంటుంది. ఎప్పుడూ నిద్రమత్తే. కడుపులో వికారంగా అనిపిస్తుంది. ఏకాగ్రత కుదరదు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. చివరికి కోమాలోకి జారిపోతారు.

కాలేయ క్యాన్సర్ అంటే ఇదివరకు డాక్టర్లలో కూడా దాదాపు 90 శాతం మందికి మరణమే అనే భావన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అత్యాధునిక సర్జరీతో క్యాన్సర్ కణుతులను పూర్తిగా తొలగించటం సాధ్యమవుతున్నది. కణితి 3- 5 సెంటీమీటర్లు ఉంటే ఆర్ఎఫ్ఏ, టీఏసీఈ వంటి సర్జరీయేతర చికిత్స చేస్తారు. వీరిలో 90 శాతం మంది కోలుకుంటారు. అయితే వీరికి రెండు మూడేండ్లలో మళ్లీ కాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా డాక్టర్కు చూపించుకుంటూ ఉండాలి. అవసరమైతే ఆ చికిత్సలను కొనసాగించి క్యాన్సర్ కణుతులను అదుపుచేస్తారు. ‘బి’ నుంచి తరువాతి స్థాయికి మారుతున్న స్థితిలో వచ్చినవారికి, ‘సి’ చైల్డ్ స్థాయి పూర్తిగా ముదరని దశలో వచ్చిన వారికి కాలేయ మార్పిడి చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. ఇలాంటి కేసులలో తొంభై అయిదు శాతం వరకు కాలేయ మార్పిడి సర్జరీలు విజయవంతం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో కాలేయ వ్యాధుల చికిత్స ఆధునికతను సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి సర్జరీలు ఎక్కువ శాతం విజయవంతం అవుతుండటం కాలేయ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తున్నాయి.
వివిధ కారణాలతో కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు రోగి ప్రాణాలను కాపాడేందుకు కాలేయ మార్పిడి ఒక్కటే మార్గాంతరం. పాడైన కాలేయాన్ని తీసేసి.. ఆ స్థానంలో ఆరోగ్యకరమైన కాలేయాన్ని అమర్చటానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేస్తారు. దీనిలో దాత నుంచి మొత్తం కాలేయాన్ని కానీ లేదా కొంతభాగాన్ని కానీ సేకరించి అమరుస్తారు. చాలా సందర్భాల్లో అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి మృతిచెందిన వెంటనే సేకరించిన కాలేయంతోనే మార్పిడి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రక్తం గ్రూపు కలిసిన కుటుంబసభ్యులు, బంధువులు తమ కాలేయంలో నాలుగో వంతు భాగాన్ని దానం చేస్తున్నారు. ఈ విధంగా కాలేయంలో కొంతభాగాన్ని తెంచుకున్నప్పటికీ దాతలు మిగిలిన భాగంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. కోల్పోయిన భాగం కొద్ది వారాల్లోనే పూర్వపు పరిమాణానికి పెరుగుతుంది. అదే సమయంలో స్వీకర్తలో కూడా కాలేయం పూర్తిస్థాయికి ఎదుగుతుంది.

అయితే… మద్యపానం, డ్రగ్స్కు అలవాటుపడిన, ఇన్ఫెక్షన్స్, గుండె – ఊపిరితిత్తులు- నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు కాలేయ దానానికి అనర్హులు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేని యాభై ఏండ్ల లోపు రక్త సంబంధీకులు ఎవరైనా కాలేయ దానం చేయవచ్చు. బంధువులు ముందుకు రాకపోయినా, వచ్చినవాళ్లు ఆరోగ్యపరంగా అర్హులు కాకపోయినా.. కాలేయ మార్పిడి అవసరమైన వారు ‘జీవన్దాన్’ పథకం కింద పేరు నమోదు చేయించుకోవాలి. అంటే కాలేయ మార్పిడికి రెండు పద్ధతులు ఉన్నాయన్న మాట. మొదటిది, జీవించి ఉన్న దాత శరీరం నుంచి సేకరించిన దాన్ని అవసరమైన వారికి అమర్చటం. రెండోది బ్రెయిన్డెడ్ అయినవారి నుంచి సేకరించడం. కాలేయం అందుబాటులోకి వచ్చిన వెంటనే వ్యాధిగ్రస్తుడిని ఆపరేషన్కు సిద్ధంచేస్తారు. బంధువు (లైవ్ డోనార్) నుంచి కాలేయం తీసుకుంటున్న పక్షంలో వేర్వేరు ఆపరేషన్ థియేటర్లలో ఒకేసారి ఇద్దరికీ సర్జరీ చేస్తారు.
అదే బ్రెయిన్డెడ్ వ్యక్తి నుంచి సేకరిస్తున్నట్లయితే ఆ కాలేయం రాగానే శస్త్రచికిత్స మొదలుపెడతారు. ఆపరేషన్ పూర్తికావటానికి నాలుగు నుంచి పద్నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక డాక్టర్ల బృందం వ్యాధిగ్రస్తుడి శరీరం నుంచి పనిచేయని కాలేయాన్ని తీసివేస్తుంటే… మరో బృందం మంచి కాలేయాన్ని మార్పిడికి సిద్ధం చేస్తుంటుంది. ఇవి పూర్తికాగానే ఆరోగ్యవంతమైన కాలేయాన్ని వ్యాధిగ్రస్తుడిలో అమర్చే సర్జరీ జరుగుతుంది. ఆరోగ్యవంతమైన దాన్ని అమర్చి రక్తనాళాలు, బైల్ డక్ట్స్ను కలిపిన వెంటనే కొత్త కాలేయంలోకి రక్తప్రవాహం ప్రారంభమవుతుంది.
ఇలా అమర్చిన కాలేయాన్ని రిజెక్షన్ (కొత్తగా అమర్చిన అవయవాన్ని శరీరం తిరస్కరించి రోగనిరోధక వ్యవస్థ దానిపైన దాడిచేయటం) నుంచి కాపాడి, కొత్త వ్యక్తి శరీరంతో సర్దుకుపోయేందుకు డాక్టర్లు ఇంజక్షన్లు, ఇతర మందులు ఇస్తారు. రక్తస్రావం, సంక్రమణ వ్యాధుల నుంచి కాపాడతారు. అదే సమయంలో మార్చిన కాలేయాన్ని కాపాడుకుంటూ అది సరిగ్గా పనిచేసేట్లు చూసుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను మార్పిడి చేయించుకున్న వ్యక్తికి, కుటుంబానికి తెలియజేస్తారు. కాలేయ మార్పిడి చేయించుకున్న వారు పూర్తిగా కొలుకున్న తరువాత కొద్దివారాలు విశ్రాంతి తీసుకుని తమ జీవితాన్ని తిరిగి ప్రారంభించగలుగుతారు.
మద్యపాన వ్యసనపరులు, వైరస్ వ్యాధులు సోకినవారు, ఫ్యాటీలివర్ వ్యాధిగ్రస్తులు లివర్ స్కార్ లక్షణాలు పూర్తిగా బయటపడే దాకా వేచి ఉండకుండా.. ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రక్తపరీక్ష, ఫైబ్రోస్కాన్ (ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ) ద్వారా కాలేయ క్యాన్సర్ను తొలిదశల్లోనే గుర్తించవచ్చు. ఇక వివిధ వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి ఆ తీవ్రతను మూడు దశలుగా గుర్తిస్తారు. వీటిని ఎ, బి, సి.. ‘చైల్డ్ పగ్ స్టేజెస్’గా వర్గీకరించారు. ‘ఎ’ చైల్డ్ దశలోనే డాక్టర్ను సంప్రదిస్తే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్సచేసి పూర్తి సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చు. మొదటి రెండు (ఎ, బి చైల్డ్ స్టేజెస్ ) దశల్లో కాలేయం చాలా వరకు తిరిగి కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. పరిస్థితి పూర్తిగా విషమించిన దశతో పోలిస్తే మొదటి దశలో చికిత్సకు అయ్యే ఖర్చు పది శాతాన్ని మించదు. దురదృష్టవశాత్తు మనదేశంలో కాలేయ వ్యాధిగ్రస్తులలో అత్యధికులు ‘బి’ నుంచి ‘సి’ చైల్డ్ స్టేజికి మారేదశలో, ‘సి’ చివరి దశలో ఆస్పత్రులకు వస్తున్నారు.
– డాక్టర్ ధర్మేశ్ కపూర్
సీనియర్ హెపటాలజిస్ట్,
లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్
యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్.