ఆరో నెల నుంచి బిడ్డకు పండ్లు రావడం మొదలు అవుతుంది. మూడేండ్లు వచ్చేసరికి పాలపండ్లన్నీ కనిపిస్తాయి. పిల్లలు గట్టి పదార్థాలు తినడానికైనా, పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమకూర్చుకోడానికైనా దంతాలే కీలకం. పండ్లు రావడం అనేది సహజమైన ప్రక్రియే అయినా.. కొన్ని ఇబ్బందికర అనుభవాలూ ఉంటాయి. వాటిని అధిగమించేందుకు అనేక మార్గాలు.
పండ్లు వచ్చే క్రమంలో నోటి నుంచి ధారాపాతంగా జొల్లు కారుతుంది. పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతున్నారు అనడానికి ఇదో సంకేతం. ఎప్పటి కప్పుడు నోరు తుడవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే, జొల్లు మరీ ఎక్కువగా ఉంటే మెదడు పనితీరుకు సంబంధించిన సమస్యగానూ అనుమానించాల్సి రావచ్చు.
పండ్లు వస్తున్న క్రమంలో ఇబ్బందిపెట్టే సమస్య..విరేచనాలు. ఆరు నుంచి ముప్పై నెలల పిల్లల్లో 68.5 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తుంది. డాక్టర్ల సూచనతో దీన్ని అరికట్టవచ్చు.
కొత్తగా పండ్లు వచ్చే చోట నొప్పి, మంట ఉంటుంది. దీంతో పిల్లలు ఏడుపు లంకించుకుంటారు. అయితే, ఈ సమస్య అందరు పిల్లల్లో ఉండదు. కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించకుండానే పండ్లు వచ్చేస్తాయి. జింజైవల్ సెర్వికల్ ఫ్లూయిడ్ (జీసీఎఫ్) వల్ల ఈ సమస్య తలెత్తుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.
అప్పటిదాకా ఇష్టంగా తిన్న ఆహారాన్ని కూడా పిల్లలు తిరస్కరిస్తున్నారంటే పండ్లు వస్తున్నట్టే. ఆ సమయంలో చిగుళ్లు మంట పెడతాయి. దాంతో మొహం తిప్పేస్తారు. ఈ దశలో పిల్లల్లో ఆకలి మందగిస్తుంది. తినడంలో ఆటంకాలకు ఇదీ ఓ కారణమే.
బిడ్డలు చేతివేళ్లను కొరుక్కుంటూ ఉంటారు. గట్టి బొమ్మలను చప్పరించడం మొదలుపెడతారు. ఏదైనా వస్తువు కనిపించగానే వెంటనే నోట్లో పెట్టేసుకుంటారు. ఇవన్నీ దంతాల రాకకు సంకేతాలు. పండ్లు వస్తున్నప్పుడు చిగుళ్లలో వాపు, నొప్పి, మంట లాంటివీ కనిపిస్తాయి. చిగుళ్లను సున్నితంగా రుద్దడం, చిన్న మంచుముక్క నోట్లో ఉంచడం ద్వారా చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు.