Digestive Health Problems | భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, భారంగా అనిపించడం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం లేదా భారమైన భోజనం చేసినప్పుడు జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారంగా సోంపు, వాము, జీలకర్ర గింజలను నమలాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదులో ఈ గింజలను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు పొట్ట అసౌకర్యాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. భోజనం తర్వాత ఈ మూడు గింజలను నమలడం భారతీయ సంప్రదాయంలో చాలా కాలంగా ఉంది. అయితే దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. గింజలను నెమ్మదిగా నమలడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన సంయోగాలు లాలాజలంతో కలిసి శరీరంలోకి చేరి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయని చెబుతున్నారు.
అసలు భోజనం తర్వాత జీర్ణక్రియ ఎందుకు నెమ్మదిస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, అధిక కొవ్వు, రిఫైన్ కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే ఒత్తిడి, శారీరక కదలికల లోపం, తక్కువ ఎంజైమ్ ఉత్పత్తి వంటి కారణాలు కూడా జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో సోంపు, వాము, జీలకర్ర వంటి గింజలు సహజ డైజెస్టివ్ సపోర్ట్గా పనిచేస్తాయని చెబుతున్నారు. సోంపు గింజలు గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే అనేతోల్ అనే సంయోగం జీర్ణాశయ కండరాలను సడలించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే లాలాజల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియ ప్రారంభ దశను మెరుగుపరుస్తుంది. అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా 5 నుంచి 10 నిమిషాల తర్వాత తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.
వాము గింజలు ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ, భారంగా అనిపించే వారికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. వాములో ఉండే థైమాల్ అనే సంయోగం గ్యాస్ట్రిక్ ఎంజైమ్ల విడుదలను పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఆయిల్ ఎక్కువగా ఉన్న భోజనం చేసిన తర్వాత వాము తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు అసౌకర్యం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. జీలకర్ర గింజలు జీర్ణక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ప్యాంక్రియాస్ నుంచి జీర్ణ ఎంజైమ్ల విడుదలను ప్రేరేపించి పోషకాలు శరీరానికి సులభంగా అందేలా చేస్తాయి. అలాగే పేగుల్లో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి మలబద్ధకం సమస్యను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. జీలకర్రను స్వల్పంగా వేయించి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఈ గింజలను సరైన విధంగా తీసుకోవడం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం కలిపి సుమారు అర టీస్పూన్ పరిమాణం సరిపోతుందని సూచిస్తున్నారు. గింజలను మింగకుండా నెమ్మదిగా నమలాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలోని సహజ రసాయనాలు విడుదలై శరీరానికి ఎక్కువ మేలు చేస్తాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ అలవాటు సరిపోదని హెచ్చరిస్తున్నారు. GERD, తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు లేదా కొన్ని ప్రత్యేక మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ గింజలను తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకుంటే లాభాలకంటే దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ గింజలతో తయారైన డైజెస్టివ్ టాబ్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, సహజ గింజలను సరైన మోతాదులో తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార అలవాట్లతో పాటు ఇలాంటి సహజ పద్ధతులను పాటించడం ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత సోంపు, వాము, జీలకర్ర గింజలను అర టీస్పూన్ పరిమాణంలో నమలడం ఒక సులభమైన అలవాటు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడటంతో పాటు గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.