కొంతమందిలో కాళ్లు, చేతుల్లో హఠాత్తుగా వాపు వస్తుంది. సోడియం అధిక మొత్తంలో తీసుకోవడమూ దీనికి కారణం కావచ్చు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉండటానికి, రక్తపోటు నియంత్రణకు, నాడుల స్పందనలు మెదడుకు చేరుకోవడానికి.. సోడియం సహకరిస్తుంది. పాలపదార్థాలు, మాంసం, కూరగాయల ద్వారా ఇది మనకు లభిస్తుంది. ఆహారంలో రుచికోసం ఉపయోగించే ఉప్పులోనూ సోడియం ఉంటుంది. మన శరీరానికి ఎంత అవసరమైనా.. సోడియం మోతాదు మించితే మాత్రం ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది.
ఆహారం రూపంలో సోడియంను కనుక ఎక్కువగా తీసుకుంటే.. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఆ రక్తపోటు గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధుల ముప్పు పెంచుతుంది. ఎక్కువైన సోడియంను శరీరం నుంచి బయటికి పంపడానికి మరిన్ని నీళ్లు అవసరం అవుతాయి. రక్త ప్రవాహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల కణాల నుంచి మరిన్ని నీళ్లను తీసుకుని, దానిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది శరీరం. దీంతో ఒంట్లో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా వాపు, ఉబ్బు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు శరీరంలో ఎక్కువైన సోడియంను బయటికి పంపడానికి మూత్రపిండాలు ‘ఆల్డొస్టిరాన్’ హార్మోన్ను మరింతగా విడుదల చేయాల్సి వస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో మరిన్ని నీళ్లు, సోడియం పేరుకుపోతాయి. శరీరంలో సోడియం ఎక్కువైన కొద్దీ మనలో దాహం పెరుగుతుంది. దాంతో మరీ మరీ నీళ్లు తాగేస్తాం. సాధారణ ఆరోగ్యవంతుల పరిస్థితి ఇలా ఉంటే, అప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారి విషయంలో శరీరంలో ఎక్కువ సోడియం పేరుకుపోవడం అంటే.. కిడ్నీలపై మరింత భారం వేయడమే.
ఆ ఆహారం వద్దు
ప్రతికూల ప్రభావాలను తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. పెద్దలైతే రోజుకు 2.3 గ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు మరింత తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సోడియం కేవలం ఉప్పు నుంచే లభిస్తుందని అనుకుంటాం. బాగా ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఆహారాల నుంచి కూడా సోడియం వస్తుంది. వీటిలో ప్రిజర్వేటివ్గా వాడతారు. రుచి కోసం సోడియంను ఎక్కువ మోతాదులో జోడిస్తారు. కాబట్టి, ప్యాకేజ్డ్ పదార్థాలు కొంటున్నప్పుడు సోడియం తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోవాలి. డబ్బాల్లో ప్యాక్ చేసిన సూప్లు, శీతలీకరించిన ఆహారం, ఇన్స్టంట్ నూడుల్స్ లాంటివాటిలోనూ సోడియం ఎక్కువే. వీటిని పూర్తిగా పక్కన పెట్టాలి. తినాలనుకున్నా మితంగానే తీసుకోవాలి. కొందరికి వివిధ ఆహారాలు, కాయలపై ఉప్పు చల్లుకోవడం అలవాటు.
దీనిని కూడా మానుకోవాలి. అసలు డైనింగ్ టేబుల్ మీద ఉప్పు డబ్బా లేకుండా చూసుకోవడమే ఉత్తమం. ముందు జాగ్రత్త విషయానికొస్తే.. సాధారణ ఉప్పు, సైంధవ లవణం మార్చిమార్చి వాడుకోవాలి. చిప్స్, ఉప్పుతో వేయించిన గింజలు, చీజ్, ఉప్పులో ఊరబెట్టిన మాంసం, చేపల్లో కూడా సోడియం అధికంగా ఉంటుంది. మనం బయట తినే ప్రాసెస్డ్ ఆహారాలు, రెస్టారెంట్ల భోజనాల రూపంలో తెలియకుండానే సోడియం ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్లిపోతుంది. కాబట్టి, బయటి భోజ నాలను తగ్గించుకుని, ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చిన్నచిన్న మార్పులతో సోడియం పరిమాణాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో సులువు.