న్యూయార్క్ : వయసుమీరిన వారిలో టీకాలు తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు తక్కువగా ప్రేరేపితమయ్యాయని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సీటీ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. వృద్ధుల్లో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలను వ్యాక్సినేషన్ అనంతరం సైతం రోగనిరోధక వ్యవస్ధ తక్కువగా పెంపొందిస్తున్నట్టు వెల్లడైంది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
టీకాలు తీసుకున్నా వయోవృద్ధులు కరోనా వేరియంట్ల బారినపడే అవకాశం అధికంగా ఉన్నట్టు అధ్యయన రచయిత, ఓహెచ్ఎస్యూ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫికాడు టఫ్సీ చెప్పారు. వృద్ధుల్లో రోగనిరోధక వ్యవస్థ స్పందన తగ్గిపోతున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైనా టీకాలు ఇప్పటికీ ఇన్ఫెక్షన్ నివారణకు, అన్ని వయసుల వారిలో తీవ్ర అస్వస్ధతను అడ్డుకోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయని చెప్పారు. మనకు అందుబాటులో ఉన్నా కరోనా టీకాలు మెరుగైన సామర్ధ్యం కలిగిఉండటం సానుకూల పరిణామమని తెలిపారు.