బీజింగ్ : బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) కారణంగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే మరణాల సంఖ్య 2030 నాటికి 50 లక్షలకు పెరుగుతుందని తాజా సర్వే హెచ్చరించింది. 1990లో బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 20 లక్షలు కాగా 2019కి అది 30 లక్షలకు చేరిందని అధ్యయనం తెలిపింది. మెదడుకు రక్త ప్రసరణలో అడ్డంకులతో స్ట్రోక్ ముప్పు తలెత్తుతుంది.
బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అయితే వీటిని నివారించవచ్చని షాంఘైలోని టాంగ్జి యూనివర్సిటీకి చెందిన లిజ్ షియాంగ్ తెలిపారు. పొగతాగడం, ఉప్పు అధికంగా వాడటం వంటి జీవనశైలి కారణాలతో పాటు హైబీపీ, అధిక బీఎంఐ వంటివి స్ట్రోక్ ముప్పును పెంచుతున్నాయని అన్నారు.
ఈ అధ్యయనం చేపట్టేందుకు 1990 నుంచి 2019 వరకూ గ్లోబల్ హెల్త్ డేటా ఎక్స్ఛేంజ్కు చెందిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ప్రపంచ జనాభా పెరుగుదలతో పాటు స్ట్రోక్ మరణాలు కూడా ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. పొగతాగడం, ఉప్పు వాడకం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, కిడ్నీ వ్యాధులు, మధుమేహం, అధిక బీఎంఐ వంటి ఏడు ముప్పు కారకాలతో స్ట్రోక్ మరణాలు పెరుగుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ముప్పు కారకాలను నివారించకుంటే స్ట్రోక్ మరణాలు 64 లక్షలకు చేరతాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
Read More