లండన్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కొవిడ్-19 సోకితే వారిలో సూపర్ ఇమ్యూనిటీ ప్రేరేపితమవుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. టీకా రెండు డోసులు తీసుకోకముందు ఇన్ఫెక్షన్కు గురైన వారిలోనూ రోగనిరోధక వ్యవస్ధ స్పందన మెరుగ్గా ఉందని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. 100 మందికి పైగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాలంటీర్ల బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు వారిని మూడు భిన్నమైన కరోనా వైరస్ స్ట్రెయిన్లకు గురిచేశారు. ఆపై వారికి నిర్వహించన పరీక్షల్లో వారిలో మెరుగైన రోగనిరోధక వ్యవస్ధ స్పందన ఉన్నట్టు గుర్తించారు.
కేవలం వ్యాక్సిన్ల ద్వారా సమకూరిన యాంటీబాడీల కంటే టీకాలు తీసుకున్న వారు ఇన్ఫెక్షన్కు గురైతే పదిరెట్లు అధికంగా యాంటీబాడీలను కలిగిఉంటారని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఒమిక్రాన్ వ్యాప్తికి ముందు ఈ అధ్యయనం జరిగినా ఈ వేరియంట్లోనూ ఇదే విధమైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. టీకాలతో పాటు ఇన్ఫెక్షన్కు గురైన వారిలో యాంటీబాడీలు మెరుగ్గా ఉండటంతో తాజా వైరస్ మైల్డ్ ఇన్ఫెక్షన్గా మారుతుందని, మహమ్మారి అంతానికి దారితీస్తుందని అధ్యయన రచయిత డాక్ట్ ఫికదు తఫెసీ పేర్కొన్నారు.
కరోనా ఇన్ఫెక్షన్ బారినపడి ఆపై టీకాలు వేయించుకున్నా లేదా టీకాలు వేసుకున్న తర్వాత బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారినపడినా ఎలాంటి తేడా లేకుండా ఆయా వ్యక్తుల్లో అద్భుతమైన రోగనిరోధక స్పందన ఉంటోందని చెప్పారు. మనచుట్టూ వైరస్ చుట్టుముట్టడంతో టీకా వేసుకున్నా వైరస్ సోకే అవకాశం ఉందని అయితే టీకా తీసుకోవడం ద్వారా మనకు మెరుగైన రక్షణ లభిస్తుందని తమ పరిశోధనలో మరోసారి వెల్లడైందని తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత మనలో వైరస్ ప్రవేశించినా దాని ప్రభావం స్వల్పంగా ఉంటుందని సూపర్ ఇమ్యూనిటీతో దాని నుంచి తేలిగ్గా బయటపడతామని చెప్పుకొచ్చారు.