న్యూఢిల్లీ : అధిక రక్తపోటు, జన్యుపరమైన కారణాలు, స్మోకింగ్, కొలెస్ట్రాల్ వంటివి స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తాయి. అయితే మెరుగైన ఆహారంతో స్ట్రోక్ రిస్క్ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాల మాదిరే మెదడు సవ్యంగా పనిచేసేందుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగాలి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా మందగిస్తే మెదడు కణాలు కుచించుకుపోయి స్ట్రోక్ ముప్పు తలెత్తే అవకాశం ఉంది.
స్ట్రోక్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ప్రధాన కారణంగా ముందుకొస్తోంది. స్ట్రోక్ ముప్పును తగ్గించేందుకు ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ఫైబర్, పోషకాలు దీర్ఘాయువుకు, తీవ్ర అనారోగ్యాల బారినపడుకుండా కాపాడేందుకు ఉపకరిస్తాయని పేర్కొంటున్నారు. పాలకూర తరచూ తీసుకుంటే స్ట్రోక్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.
పాలకూరలో ఉండే ఐరన్, విటమిన్ కే, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఆరోగ్యానికి మేలుచేస్తాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. పాలకూరతో రక్తపోటు రోగుల్లో స్ట్రోక్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం తెలిపింది. పొటాషియం అధికంగా తీసుకునే వారిలోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.
ఈ పోషకాన్ని తగినంతగా తీసుకుంటే స్ట్రోక్ ముప్పు 27 శాతం తగ్గుతుందని వెల్లడించింది. పొటాషియం అధికంగా ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే స్ట్రోక్ ముప్పు తగ్గడంతో పాటు అకాల మరణాన్ని నివారిస్తుందని పేర్కొంది. ఇక పొటాషియం రక్త కణాలు రిలాక్స్ అయ్యేలా చేయడంతో పాటు సోడియం నిల్వలను తగ్గిస్తుందని దీంతో అధిక రక్తపోటు తగ్గుముఖం పడుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలిపింది.